ధర్నాలో మాట్లాడుతున్న వక్తలు
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
విద్యా వవస్థలో అనుసరిస్తున్న విచ్చిన్న విధానాలు ప్రభుత్వాలు వీడకుంటే ఉద్యమిస్తామని ఎపిటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాయల్ వెంకటేష్, ఎస్.సిరాజుద్దీన్, రాష్ట్ర కార్యదర్శి జి.పాతిరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోరుతూ ఎపిటిఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో నేడు విద్యారంగం తీవ్ర ఒత్తిడికి గురవుతోందన్నారు. దశాబ్దాల నుంచి అమలులో ఉన్న గ్రామీణ పట్టణ ప్రాంతాలలోని ప్రాథమిక పాఠశాలల వ్యవస్థకు విఘాతం కలుగుతోందన్నారు. ఫౌండేషన్ పాఠశాలల పేరుతో ప్రాథమిక పాఠశాలల స్థానంలో ఒకటి రెండు తరగతులకు మాత్రమే పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. తొమ్మిది రకాల పాఠశాలల కోసం ప్రభుత్వం పథక రచన చేస్తుందని, ఒక్కొక్క రకమైన పాఠశాలలో ఒక్కొక్క విధంగా అశాస్త్రీయ పద్ధతిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని పాటిస్తుందన్నారు. ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నత పాఠశాలలో కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉపాధ్యాయులను నియమించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మానుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ సూపరింటెండెంట్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎపిటిఎఫ్ రాష్ట్ర పూర్వపు అధ్యక్షులు ఎన్.రఘురామిరెడ్డి, రాష్ట్ర పూర్వపు కార్యదర్శి బి.నరసింహులు, నాయకులు దేశాయి నాగరాజు, డేనియల్, మోహన్రెడ్డి, రామాంజనేయులు, సతీష్ కుమార్, సుభద్ర, సర్దార్ వలి, వెంకటరమణతో పాటు 300 మంది కార్యకర్తలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.