నేడే మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాసం

  • బెంగళూర్ క్యాంప్ నుండి వచ్చిన అసమ్మతి కౌన్సిలర్ లు
  • మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున మోహరించిన పోలీసులు
  • అవిశ్వాసం కోసం సర్వం సిద్ధం చేసిన అధికారులు
  • ఎన్నికల అధికారిగా కదిరి ఆర్డీఓ వివిఎస్ శర్మ

ప్రజాశక్తి-కదిరి : కదిరి మున్సిపాల్టీలో వైసీపీలో నెలకొన్న ముసలం ఏకంగా మున్సిపల్ ఛైర్పర్సన్ నజీమున్నిసాపై అవిశ్వాస తీర్మానానికి దారితీసింది. 2021 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అప్పట్లో వైసీపీ మొత్తం 36 వార్డులకు గాను 30 వార్డుల్లో వైసీపీ తరపున పోటీ చేసిన వారు గెలుపొందారు. 5 వార్డుల్లో టీడీపీకి చెందిన వారు గెలుపొందారు. ఒక స్థానంలో వైసీపీ రెబల్ ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా గెలుపొందారు. అనంతరం అప్పటి ఎమ్మెల్యే సహకారంతో నజీమునిషా రెండున్నర సంవత్సరాల పాటు చైర్ పర్సన్ గా కొనసాగేలా ఒప్పందం చేసుకున్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. దీంతో వైసీపీ హయంలోనే రెండున్నర సంవత్సరాల పదవి కాలం ముగియడంతో చైర్ పర్సన్ నజీమున్నీసా రాజీనామా చేయాలని కోరుతూ అప్పట్లో కౌన్సిలర్ లు సైతం విహారయాత్రకి వెళ్ళారు. దీంతో వైసీపీ పెద్దలు జోక్యం చేసుకొని వివాదానికి తెర దింపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నాలుగు సంవత్సరాల జీఓ కాలం ముగియడంతో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో పట్టణంతో పాటు వార్డులలో అభివృద్ధిని ఆకాంక్షిస్తూ వైసీపీకి చెందిన అసమ్మతి కౌన్సిలర్లు గత నెలలో జిల్లా కలెక్టర్ టీ ఎస్ చేతన్ ను కలిసి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా సంతకాలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ నేడు చైర్ పర్సన్ నజీమున్నీసాపై అవిశ్వాస తీర్మానాన్ని సమావేశం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.

ఎన్నికల అధికారిగా ఆర్డీఓ వివిఎస్ శర్మ

అవిశ్వాస తీర్మానం సజావుగా సాగేందుకు ఆర్డీఓ వివిఎస్ శర్మ ను ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ టీ ఎస్ చేతన్ ఆదేశాలు జారీ చేశారు.

అసమ్మతి కౌన్సిలర్లు క్యాంప్……

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అప్పట్లో ప్రజలు వైసిపికి అవకాశం ఇచ్చి గెలిపిస్తే మున్సిపల్ చైర్ పర్సన్ నజీమున్నీసా సాదిక్ వ్యవహార శైలితో గత నాలుగు సంవత్సరాలుగా అభివృద్ధి ఏ మాత్రం జరగలేదని తమ వార్డులలో నెలకొన్న చిన్నపాటి సమస్యలు సైతం పరిష్కరించలేని దుస్థితిలో ఉన్నామని కౌన్సిలర్లు పేర్కొన్నారు. చైర్ పర్సన్ కి సొంత లాభం తప్ప పట్టణాభివృద్ధికి తోడ్పాటు అందించిన పాపాన పోలేదని అవినీతిలో మునిగి తేలుతున్నారని ఆరోపిస్తూ చైర్ పర్సన్ నజీమున్నీసా రాజీనామా చేయాలని కోరారు. అవిశ్వాసంలో ఎట్టి పరిస్థితుల్లో గద్దె దింపాలనే ఆలోచనతో గత వారం రోజులుగా క్యాంప్ కి తరలివెళ్లారు. బెంగళూర్ క్యాంప్ నుండి నేరుగా ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయంకి చేరుకున్నారు.

పోలీసులు గట్టి బందోబస్తు

అవిశ్వాసం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం సరిహద్దులలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

➡️