ఉద్యోగులతో కలిసి బుక్లెట్ను విడుదల చేస్తున్న సిఐటియు నాయకులు
ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్
కార్మికుల శ్రమను యజమానులకు దోచిపెట్టి వెట్టిచాకిరిలోకి నెట్టివేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేసి, కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తేదిన కార్మిక, శ్రామిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం నగరంలో సమావేశాలు నిర్వహించారు. తాడిపత్రి బస్ స్టాండ్ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సార్వత్రిక సమ్మెబుక్ లెట్ను ఆవిష్కరించరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ, హమాలీ యూనియన్ నాయకులు ఆదినారాయణ, నరసింహులు, రాజన్న తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు మద్దతు ప్రకటించారు.