అధికారిణికి వినతిపత్రం అందజేస్తున్న సిఐటియు నాయకులు
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉపాధి కల్పించాలని, అనంతపురంలో కార్మికుల సంఖ్య పెంచాలని, అదనపు కార్మికులకు రూ.15 వేల వేతనంతోపాటు ఇపిఎఫ్, ఇపిస్ఐ కట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ కార్మికులకు బకాయి ఉన్న మూడు సంవత్సరాల సరెండర్ లీవ్, ఇంక్రిమెంట్లు, డిఎలు అమలు చేయాలని, ఇంజినీరింగ్ సెక్షన్ విభాగంలో 2011వ సంవత్సరంలో 309 మందికి తొమ్మిది నెలల ఇపిఎఫ్ జమ చేయాలన్నారు. అనారోగ్యంతో మరణించిన కార్మికులకు తక్షణమే ఎక్స్గ్రేషియా అమలు చేయాలని, 60ఏళ్ల రిటైర్మెంట్ పేరుతో తొలగిస్తున్న కార్మికులకు కుటుంబాలు ఉపాధి కల్పిస్తూ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 17 రోజుల సమ్మె పోరాటంలో భాగంగా పెండింగ్లో ఉన్న జీవోలను అమలు చేయాలని కోరారు. ఆయా సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఈనెల 8న మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలిపారు. అలాగే ఈనెల 20న దేశవ్యాప్తంగా చేపట్టనున్న సమ్మెలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ పావనికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి వెంకటనారాయణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎటిఎం నాగరాజు, నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, రెగ్యులర్ కార్మికుల నగర అధ్యక్షుడు ఎల్.ముత్తురాజు, నగర కార్యదర్శులు ఎర్రిస్వామి, తిరుమలేష్, మహిళా కన్వీనర్లు లక్ష్మీనరసమ్మ, వరలక్ష్మి, కమిటీ సభ్యులు ఆది, శ్రీనివాస్మూర్తి, బంగ్లా రాఘవేంద్రప్రసాద్, నాగేంద్ర, పెన్నా, కుమార్, చలపతి, పుల్లన్న, మీసాల నారాయణ, రవి, జయరాం, ముత్యాలమ్మ, మరియమ్మ, కృపమ్మ, మంజుల, అంజనమ్మ, తదితరులు పాల్గొన్నారు.