ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిద్దాం

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

కలెక్టర్‌ డా||వి.వినోద్‌కుమార్‌

పలు సమస్యలపై కమిషనర్ల విన్నపం

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌

జిల్లాలోని మున్సిపల్‌ పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్యానికి ప్రాధాన్యతను ఇచ్చేలా అన్ని చర్యలూ తీసుకోవాలని కలెక్టర్‌ డా||వి.వినోద్‌కుమార్‌ కమిషనర్లను ఆదేశించారు. అనంతపురం కార్పొరేషన్‌ కౌన్సిల్‌ హాలులో జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల కమిషనర్లు, అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పారిశుధ్యం, తాగునీరు, వీధిలైట్లు, అన్నా క్యాంటీన్లు, ఇంటింటి చెత్త సేకరణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా పలువురు కమిషనర్లు వారి పరిధిలో నెలకొన్న సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక సంవత్సరం ముగింపులో సిఎఫ్‌ఎంఎస్‌ బిల్లులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారులు పనులు చేసేందుకు ముందుకు రాలేదన్నారు. పారిశుధ్య వాహనాలకు రెగ్యులర్‌ డ్రైవర్లు లేరన్నారు. మున్సిపాల్టీ జనాభాకు అనుగుణంగా పారిశుధ్య కార్మికులు లేరన్నారు. వీటిపై కలెక్టర్‌ స్పందిస్తూ అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఆయా మున్సిపాల్టీలో పారిశుధ్య కార్మికుల నియామకానికి జాబితాను పంపాలన్నారు. పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. హెల్త్‌ అసిస్టెంట్లు శానిటరీ ఇన్స్‌పెక్టర్లుగా ఉద్యోగోన్నతి పొందటానికి అవసరమైన అర్హతలుంటే జాబితా తనకు పంపాలని మున్సిపల్‌ ఆర్డీ విశ్వనాథంకు తెలిపారు. మున్సిపాల్టీలో ప్లాస్టిక్‌ నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ రీజినల్‌ డైరెక్టర్‌ విశ్వనాథం, అనంత కమిషనర్‌ బాలస్వామి, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ చంద్రశేఖర్‌, డిప్యూటీ కమిషనర్‌ పావని, జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల కమిషనర్లు పాల్గొన్నారు.

➡️