సీసీ రోడ్డు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే పరిటాల సునీత
ప్రజాశక్తి-అనంతపురం రూరల్
గ్రామాల్లో అంటరానితం, కులవివక్షకు వ్యతిరేకంగా పరిటాల శ్రీరాములు పోరాటం చేశారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అనంతపురం రూరల్ పరిధిలోని సోములదొడ్డి వద్ద ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. అనంతరం రూ.60 లక్షల ఎన్ఆర్ఇజిఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యంగం వల్లే ఐక్యంగా, సమానంగా జీవిస్తున్నామన్నారు. ఆరోజుల్లో రామగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎస్సిలను కనీసం బావుల్లో నీరు కూడా తాగనిచ్చేవారు కాదని గుర్తు చేశారు. అయితే తన మామ పరిటాల శ్రీరాములు దీన్ని వ్యతిరేకించి పోరాటాలు చేశారన్నారు. ఈ పోరాటాన్ని చాలామంది వ్యతిరేకించినా శ్రీరాములు ఎస్సీల పక్షాన నిలబడ్డారన్నారు. అప్పటి నుంచి నేటి వరకూ తమకు ఎస్సీ, ఎస్టీ, బీసీలతో తాము సమానంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి వేణుగోపాల్, పామురాయి వెంకటేష్, ఎంఆర్పిఎస్, కూటమి నాయకులు పాల్గొన్నారు.