అనంతపురం క్లాక్ టవర్ వద్ద నిరసన తెలుపుతున్న రైతు, కార్మిక సంఘాల నాయకులు
అనంతపురం కలెక్టరేట్ : దేశ సంపదను లూటీచేసే కార్పొరేట్ సంస్థలను బహిష్కరిద్దాం.. వ్యవసాయ కార్మిక రంగాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా రైతు, శ్రామిక, కార్మిక సంఘాల నేతలు ‘క్విట్ కార్పొరేట్’ నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. దేశ సంపదను లూటీ చేస్తున్న కార్పొరేట్లను బహిష్కరిద్దామని రైతు, కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిస్తూ వ్యవసాయ కార్మిక సంఘాన్ని కాపాడుకుందాం అని నిరసన ర్యాలీలు చేపట్టారు. ”క్విట్ కార్పొరేట్- సేవ్ అగ్రికల్చర్” నినాదంతో అనంతపురం జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాల్టీలు, మండల కేంద్రాల్లో ర్యాలీలు కొనసాగాయి. అనంతపురంలోని లలిత కళాపరిషత్ కూడలి నుంచి వందలాది మంది టవరక్లాక్ వరకు ప్రదర్శన చేపట్టారు. అక్కడ క్వింట్ కార్పొరేట్.. సేవ్ అగ్రికల్చర్ అంటూ నినాదాలు చేశారు. గత పదేళ్లుగా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యవసాయాన్ని విచ్ఛినం చేస్తూ కార్పొరేట్లకు ఎర్ర తివాచీ వేస్తున్నారని చెప్పారు. ఇలాంటి చర్యలను తిప్పికొట్టి కార్పొరేట్లను తరిమి కొట్టాలని నాయకులు పిలుపునిచ్చారు.