విలేకరులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి
ప్రజాశక్తి-గుంతకల్లు
ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక డూపర్ పథకాలుగా మార్చారని మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి ఎద్దేవా చేశారు. శనివా రం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎం చంద్రబాబు ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో అధికారం చేపట్టి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. త్వరలో జమిలి ఎన్నికలు రానున్నాయని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వానికి డిపాజిట్లు దక్కవన్నారు. ఉచిత వంటగ్యాస్ మొదలుకుని తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 18 ఏళ్ల పైబడిన మహిళలకు నెలకు రూ.1500, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అనేక హామీలపై కూటమి ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేదాకా ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. ఇకపోతే ఆరోగ్యరీత్యా నాలుగు నెలలుగా హైదరాబాదులో చికిత్స తీసుకుని తిరిగి గుంతకల్లుకు వచ్చిన సందర్భంగా శుక్రవారం కార్యకర్తలు, నాయకులు తనపై చూపించిన ప్రేమాభిమానాలు వెలకట్టలేనివని అన్నారు.ప్రతి కార్యకర్తకూ అన్నివిధాలా ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో వైసిపి సీనియర్ నాయకులు యుగంధర్రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఖలీల్, మండల అధ్యక్షులు రాము, కౌన్సిలర్లు లింగన్న, సుమో బాషా, ముస్లిం మైనార్టీ నాయకులు నూర్ నిజామీ, ఫ్లయింగ్ మాబు, నాయకులు గోవింద్నాయక్, జయరామ్రెడ్డి, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు బాసిద్, తదితరులు పాల్గొన్నారు.