ప్రజాశక్తి – సాలూరురూరల్ : ఒక్క పిల్లలను ఆదర్శవంతంగా తయారు చేసేలా స్థానికంగా ఉండే అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందిదేనని, దీన్ని ఒక బాధ్యతగా చేసుకొని పనిచేయాలని స్త్రీ, శిశుసంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో కొత్తగా అంగన్వాడీ కేంద్రాల్లో ఎంపికైన వర్కర్లు, ఆయాలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లలను కొన్నేళ్లు మాత్రమే చూసుకోగలరని, ఆ తర్వాత మూడు నుంచి ఐదేళ్ల వరకు పూర్తిగా వారికి విద్యాబుద్ధులు, మంచి నడవడిక, ఆట పాటలు నేర్పించాల్సిన బాధ్యత అంగన్వాడీ కేంద్రాల్లో పని చేసే సిబ్బందిపైనే ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆ పిల్లలను సమాజానికి పనికొచ్చే పౌరులుగా తీర్చిదిద్దడానికి మొదటి మెట్టుగా మీరు కృషి చేయాల్సి ఉందని తెలిపారు. కొత్తగా ఎంపికైన అభ్యర్థులంతా తమ తమ కేంద్రాల్లో చక్కగా పిల్లలకు పౌష్టికాహారం అందించి చదువులు చెప్పి గ్రామంలో గర్భిణీలకు, బాలింతలకు సరైన సమయంలో ఆహారం అందించేలా కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సాలూరు ఐసిడిఎస్ ఇన్చార్జి పిఒ విజయలక్ష్మి, సాలూరు పట్టణ, మండల, పాచిపెంట, మక్కువ మండల అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, ఆముదాల పరమేష్, ముఖీ సూర్యనారాయణ, గుల్ల వేణుగోపాలరావు, పట్టణ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
