ప్రజాశక్తి-మార్కాపురం : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన విఫలమైందని, ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుందని వైసిపి మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు అన్నారు. సిఎం చంద్రబాబు పాలనలో అన్ని విధాలుగా విఫలమయ్యారని విమర్శించారు. స్థానిక జవహర్నగర్లోని వైసిపి కార్యాలయంలో పార్టీ పట్టణ కార్యకర్తల సమావేశం ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ వైసిపి క్యాడర్ నిరుత్సాహపడాల్సిన పనిలేదన్నారు. జనం అంతా జగన్ సిఎం అయితే బాగుండని చర్చించుకుంటున్నారన్నారు. ఇచ్చిన హామీలన్నీ ఈ ఏడాదికి చంద్రబాబు ఎగనామం పెట్టారన్నారు. ఇక ముందు కూడా చేస్తారన్న నమ్మకం ప్రజలకు లేదన్నారు. మార్కాపురం జిల్లా, వెలిగొండ ప్రాజెక్టు ఊసే ఎత్తడం లేదన్నారు. వైసిపి అధినేత జగన్మోహన్రెడ్డి సిఎంగా ఉన్న కాలంలో పథకాలు ఎలా ఇచ్చారో ప్రజలకు వివరించాలన్నారు. చంద్రబాబు కాలంలో పథకాలు ఇవ్వకపోగా.. ధరలు విపరీతంగా పెంచారన్నారు. విద్యుత్ చార్జీలు పెంచనని, తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే బాదుడు కార్యక్రమం మొదలు పెట్టారన్నారు. మార్కాపురం సమీపంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం నిలుపుదల చేయడం దుర్మార్గమన్నారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిర్లంచెర్ల బాలమురళీకృష్ణ, ఎఎంసి మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, వైసిపి ఇంటలెక్చువల్ రాష్ట్ర కార్యదర్శి మేడా బద్రీనాథ్, కౌన్సిలర్లు బుశ్శెట్టి నాగేశ్వరరావు, కొత్త కృష్ణ, చాటకొండ చంద్రశేఖర్, వైసిపి నాయకులు గుంటక చెన్నారెడ్డి, చాతరాజుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
