ప్రజాశక్తి , ఎంవిపి కాలనీ (విశాఖ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లాలో ప్రతిభ కనబర్చిన 5-18 ఏళ్ళు (31 జూలై, 2025 లోపు) వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, జాతీయ ప్రధాన్ మంత్రి రాష్ట్రీరు బాల్ పురస్కారాలను ప్రదానం చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఏపి ఎస్సిపిసిఆర్) సభ్యులు గొండు సీతారాం తెలిపారు. మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ …. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, ధైర్య సాహసాలు, పర్యావరణం, క్రీడలు, కళలు, సంగీతం, నఅత్యం, పెయింటింగ్, నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు మొదలైన వాటిలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరుస్తున్న భారత సంతతికి చెందిన ఆసక్తిగల గల బాలలు ఈ ఏడాది జులై 31 తేదీ లోపుగా ఈ వెబ్సైట్ http:/awards.gov.in ద్వారా దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపించాలని సూచించారు. కేంద్రం నియమించిన కమిటీ ద్వారా పరిశీలించి, ఎంపిక కాబడిన బాలలకు న్యూ ఢిల్లీలో 2026, జనవరిలో దేశ రాష్ట్రపతి చేతులమీదుగా బహుమతితో పాటు, ప్రశంసా పత్రాన్ని, జ్ఞాపికను అందజేయనున్నారని చెప్పారు. మన రాష్ట్రంలో ప్రతిభగల ఆయా రంగాల బాలలను వెన్ను తట్టి ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఏపీ ఎస్సీపిసిఆర్) రాష్ట్రంలోని వివిధ శాఖల ద్వారా వీటిపై విరివిగా అవగాహనా కార్యక్రమాలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించి ఆంధ్ర రాష్ట్ర బాలల ప్రతిభా, పాఠవాలు దేశ వ్యాప్తంగా ఇనుమడింపజేసేలా చర్యలు చేపట్టాలని తమ కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్టు సీతారాం తెలిపారు.
జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం : ఏపీ ఎస్సి పిసిఆర్ సభ్యులు సీతారాం
