అప్రోచ్‌ రోడ్డు రైతుల సమస్యలు పరిష్కరిస్తాం

Apr 23,2025 22:24

 ప్రజాశక్తి-భోగాపురం : విమానాశ్రయానికి వెళ్లే రహదారిలోని రైతుల అప్రోచ్‌రోడ్డు సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ హామీ ఇచ్చారు. విమానాశ్రయానికి సంబంధించిన గుడెపువలస, రావివలస అమటాం, సవరవిల్లి, దల్లిపేట,బైరెడ్డి పాలెం గ్రామాలకు చెందిన రహదారిలో బుధవారం ఆయన పర్యటించారు. ప్రధాన సమస్య అయిన విమానాశ్రయానికి వెళ్లే అప్రోచ్‌ రోడ్డులో తమ పొలాల్లోకి రహదారి సౌకర్యం కల్పించాలని రైతులు, నాయకులు కోరారు. అప్రోచ్‌ రోడ్డుకు ఇరువైపులా భూమి ఎంత ఉందో కొలతలు వేయాలని అధికారులకు కలెక్టర్‌ ఆదేశించారు. అప్రోచ్‌ రోడ్డు రహదారికి భూములు ఇచ్చినప్పటికీ కోర్టు వివాదంలో పరిహారం అందలేదని నాయకులు మట్ట అయ్యప్ప రెడ్డి, బైరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, యర్రప్పల నారాయణ తదితరులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కూడా అధికారులతో మాట్లాడి పరిహారం వచ్చేలా చూస్తానని అన్నారు. గతంలో విమానాశ్రయ ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ 22ఎ లో ఉండడంతో బ్యాంకులకు వెళ్లి రుణాలు తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని మార్క్‌ ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్‌డిఒకు ఆదేశించారు. అప్రోచ్‌ రోడ్డు నుంచి అమకాం గ్రామానికి వెళ్లే రహదారి కావాలని ఆ గ్రామ నాయకులు కోరడంతో సమస్యను సరిచేస్తానని కలెక్టర్‌ తెలిపారు. అమటాం రావివలస వద్ద అండర్‌ పాత్‌ కావాలని గ్రామస్థులు కోరగా అందుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ తెలిపారు. విమానాశ్రయ నిర్మాణానికి భూములు ఇచ్చిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్‌ రైతులకు తెలిపారు. తహశీల్దార్‌ సురేష్‌, ఎయిర్‌పోర్ట్‌ ప్రతినిధులు రామరాజు, సర్పంచ్‌ ఉప్పాడ విజయభాస్కర్‌ రెడ్డి, నాయకులు సూర్యనారాయణ మూర్తి రాజు, కోరాడ తాతారావు, కొత్తయ్య రెడ్డి, కొల్లి రామ్మూర్తి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం

పూసపాటిరేగ : ప్రజల నుండి వచ్చే వినతులకు అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. పూసపాటి రేగ తహసీల్దార్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ సందర్శించారు. పిజిఆర్‌ఎస్‌ లో వచ్చిన వినతులు, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన వినతులు, రీ ఓపెన్‌ అయిన వినతులపై కలెక్టర్‌ సమీక్షించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అందిన వినతులకు క్షేత్ర స్థాయితో పరిశీలించి సరైన సమాధానం ఇవ్వాలన్నారు. విఆర్‌ఒలతో మాట్లాడుతూ ఐవిఆర్‌ఎస్‌ కాల్స్‌లో పాస్‌ బుక్‌ జారీ చేసేటప్పుడు నిర్దేశిత రుసుము కన్నా అదనంగా వసూలు చేస్తున్నారని కొంతమంది విఆర్‌ఒలపై ప్రజలు ఫిర్యాదు చేసారని, క్షేత్ర స్థాయి వెరిఫికేషన్‌ చేయడం లేదని, వెరిఫికేషన్‌కు వస్తున్నట్లు నోటీస్‌లు జారీ చేయడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని, ఇక పై అటువంటి ఫిర్యాదులకు తావు లేకుండా చూడాలని కలెక్టర్‌ సూచించారు. ఆర్‌డిఒ కీర్తి, తహసీల్దార్‌ తాడ్డి గోవింద్‌, డిటి, ఆర్‌ఐలు, విఆర్‌ఒలు పాల్గొన్నారు

➡️