ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎపిటిఎఫ్ ఆధ్వర్యాన శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేశారు. అన్ని గ్రామాల్లో మోడల్ ప్రైమరీ లేదా బేసిక్ ప్రైమరీ పాఠశాల నిర్వహించాలని, ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక పాఠశాలను అనుసంధానించాలని, జీవో నెంబర్ 55 ప్రకారం యుపి స్కూళ్లలో 6 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తప్పనిసరిగా ఉండాలని డిమాండ్ చేశారు. అన్ని ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా హెచ్ఎం, పోస్టులు మంజూరు చేయాలని, ఉన్నత పాఠశాలలో 45 మంది విద్యార్థులు దాటిన ఎడల రెండవ సెక్షన్ మంజూరు చేయాలని కోరారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్లో నూతన పాఠశాలను ఏర్పాటు చేయాలని, వెంటనే 12 పిఆర్సి కమిషన్ నియమించాలని, పెండింగ్ డిఎలను తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్తేరు శ్రీనివాస్, రాష్ట్ర అకడమిక్ కౌన్సిల్ జెసి రాజు, గౌరవాధ్యక్షులు బంకురు జోగినాయుడు, రాష్ట్ర కౌన్సిల్ కర్రి రవి, జిల్లా కార్యదర్శి కె.సింహాచలం, జోనల్ కన్వీనర్ సివిఎల్ఎస్కె శర్మ, మజ్జి రమేష్, టి.శ్రీనివాసరావు, ఆర్.శ్రీధర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇన్ఛార్జి కలెక్టర్ సేతుమాధవ్ను వినతి అందజేశారు.
