ప్రజాశక్తి-విజయనగరంకోట : ఆస్తి కోసం తల్లిదండ్రులను ట్రాక్టర్తో తొక్కించి హత్య చేసిన కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన విషయాలను సోమవారం డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో డిఎస్పి ఎం.శ్రీనివాసరావు వెల్లడించారు. పూసపాటిరేగ మండలం చల్లవానితోట గ్రామ పరిధిలో ఈనెల 26న తల్లిదండ్రులను హతమార్చిన పాండ్రంకి రాజశేఖర్ను సోమవారం ఉదయం చోడమ్మ అగ్రహారం గ్రామ జంక్షన్ వద్ద భోగాపురం సిఐ జి.రామకృష్ణ అరెస్టు చేశారు. పాండ్రంకి అప్పలనాయుడు, పాండ్రంకి జయమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె రాధ కుమారిని ఆనందపురం మండలం నేలతేరు గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం చేశారు. వివాహ సమయంలో అప్పలనాయుడు వారి కుమార్తె పేరున 20 సెంట్లు భూమిని రాసి ఇవ్వగా, ఇంకనూ 70 సెంట్లు భూమి వారి పేరున ఉంది. కుమారుడు పాండ్రంకి రాజశేఖర్ కు ఊరిలో రూ.12లక్షలు వరకు అప్పులు ఉండగా, వాటిని తీర్చేందుకు ఆ భూమిని అమ్ముదామని తల్లిదండ్రులను వేధిస్తుండేవాడు. ఈ విషయమై గ్రామ పెద్దలు వద్ద పంచాయితీ పెట్టగా, సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇరువురి మద్య భేదాభిప్రాయాలు వచ్చి, తరుచూ గొడవలు పడుతుండేవి. కుటుంబంలో వచ్చిన విభేదాలు కారణంగా పాండ్రంకి రాజశేఖర్ గత ఏడాది ఆక్టోబరులో తల్లిదండ్రులతో విడిపోయి, భార్య, కుమార్తెతో కలసి, రెల్లివలస వెళ్ళిపోయి వేరే ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. ఇటీవల నిందితుడు పాండ్రంకి రాజశేఖర్ రైతు భరోసా కోసం సచివాలయంలో దరఖాస్తు చేసేందుకు సంప్రదించగా, భూమికి సంబంధించిన పాస్ బుక్కులు తీసుకొని రావాలని సూచించారు. రాజశేఖర్ మీసేవలో కాపీలు తీయగా, తన తండ్రి పేరున ఉండాల్సిన 70సెంట్లుకు బదులు 40 సెంట్లు మాత్రమే ఉన్నట్లు, మిగిలిన 30సెంట్లు భూమి డిసెంబరు 2024లో తన సోదరి గంగిరెద్దుల రాధ కుమారి పేరున రిజిస్ట్రేషను చేసినట్లుగా గుర్తించాడు. ఈ విషయమై తల్లిదండ్రులను ప్రశ్నించగా, దానికి వారు స్పందించక పోవడంతో, గ్రామ పెద్దలు సమక్షంలో మరోసారి పంచాయతీ జరిగింది. అయితే, తన సోదరి పేరున వ్రాసిన భూమిని చదును చేస్తే, సమస్య పరిష్కారం అవుతందని భావించిన రాజశేఖర్ ఈనెల 26న ట్రాక్టరుతో కొంత మట్టిని రోడ్డు నుండి పొలంకు వెళ్ళే దారిలో వేసి, చదును చేసేందుకు జెసిబి పెట్టినట్లుగా తల్లిదండ్రులకు తెలిసి, పాండ్రంకి రాజశేఖర్ గొడవపడ్డారు. ఇరువురి మధ్య తగువు జరగడంతో జెసిబి డ్రైవరు చదును చెయ్యకుండా అక్కడ నుండి వెళ్ళిపోగా, కోపోద్రేకుడైన రాజశేఖర్ దగ్గరలోని నడుపూరు కల్లంలోగల తన ట్రాక్టరును తీసుకొచ్చి తల్లిదండ్రులను గుద్దేందుకు ప్రయత్నించగా, వారు భయంతో ప్రక్కనే ఉన్న రంగమ్మగారి మొక్కజొన్న చేనులో దాక్కున్నారు. వారిని చంపాలనే దురుద్ధేశంతో మొక్కజొన్న చేనులో ట్రాక్టరును రెండు మూడు సార్లు త్రిప్పి, చేనులో దాక్కున్న తల్లిదండ్రులపై నుండి ట్రాక్టరు పోనివ్వడంతో వారు మరణించారు. సోదరి రాధకుమారి ఫిర్యాదుమేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డిఎస్పి తెలిపారు. సమావేశంలో భోగాపురం సిఐ జి.రామకృష్ణ, పూసపాటిరేగ ఎస్ఐ ఐ.దుర్గాప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
