శ్రీబకాయి జీతం రూ.2800 వెంటనే ఇవ్వాలి
ఆశా వర్కర్స్ యూనియన్ డిమాండ్
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : వైద్య ఆరోగ్య శాఖలో ప్రజలకు సేవలందిస్తున్న ఆశా వర్కర్ల జీతాలు పెంచుతూ ప్రభుత్వం సంక్రాంతికి తీపి కబురు చెప్పాలని ఎపి ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నగర అధ్యక్షులు ఎ. జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. మంగళవారం పద్మావతి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లతో నిరసన తెలిపారు. పని భారం ఒత్తిడి పెరుగుతుందని, 12 రకాల రికార్డులతో పాటు ఆన్లైన్ వర్క్ కూడా చేయాల్సి వస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం జీతాలు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చి అధికారాన్ని కోల్పోయిందని, ఆ సందర్భంగా ధర్నా శిబిరాల వద్దకు వచ్చి అధికారంలో రాగానే జీతాలు పెంచుతామని చెప్పిన నూతన కూటమి ప్రభుత్వ పెద్దలు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగువారి అతి పెద్ద పండుగ సంక్రాంతి కైనా జీతాలు పెంచుతూ ఆశా వర్కర్లకు తీపి కబురు చెప్పాలని, డిసెంబర్ నెలలో బకాయి ఉన్న రూ.2800 జీతం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు అప్పయమ్మ తదితరులు పాల్గొన్నారు.