జాతీయస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌లో ఎఎస్‌ఐ ప్రతిభ

May 8,2025 20:23

జాతీయ స్థాయిలో నాలుగు బంగారు పతకాలు సాధించిన త్రినాధరావు

అభినందించిన ఎస్‌పి

ప్రజాశక్తి-విజయనగరంకోట : ఇటీవల కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలో నిర్వహించిన జాతీయస్థాయి డెడ్‌ లిఫ్ట్‌ అండ్‌ బెంచ్‌ ప్రెస్‌ ఛాంపియన్షిప్‌ పోటీల్లో విజయనగరం వన్‌టౌన్‌ స్టేషన్‌కు చెందిన ఎఎస్‌ఐ ఆల్తి త్రినాథరావు నాలుగు బంగారు, ఉద్యోగ విరమణ చేసిన ఆర్మ్‌డ్‌ రిజర్వు హెచ్‌సి మజ్జి శంకర్రావు నాలుగు సిల్వర్‌ పతకాలు సాధించారు. ఈ సందర్భంగా వీరిని గురువారం ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ తన కార్యాలయంలో అభినందించారు. ఎస్‌పి మాట్లాడుతూ పవర్‌ లిఫ్టింగులో 93కిలోలు, 60 ప్లస్‌ విభాగంలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని నాలుగు బంగారు పతకాలు, 74కిలోలు 70 ప్లస్‌ విభాగంలో పాల్గొని నాలుగు సిల్వర్‌ పతకాలు సాధించడం గొప్ప విషయమని అన్నారు. వీరు ఫిట్నెస్‌ మేనేజ్‌మెంట్‌లో మిగిలిన పోలీసు ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో భూటాన్‌లో నిర్వహించే అంతర్జాతీయ పోటీల్లో కూడా పాల్గొని, మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విజయనగరం 1వ పట్టణ సిఐ ఎస్‌.శ్రీనివాస్‌, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️