ఎస్ఐకు ఫిర్యాదు చేస్తున్న రిపోర్టర్, యూనియన్ నాయకులు
ప్రజాశక్తి – విజయపురిసౌత్ : తనపై భూకబ్జా దారులు దాడికి యత్నించారని, చంపుతామంటూ బెదిరించారని మహాటీవీ మాచర్ల నియోజకవర్గ రిపోర్టర్ గాజుల గణేష్ ఎపియుడబ్ల్యూజె నాయకులతో కలిసి మాచర్ల పట్టణ ఎస్ఐ సంధ్యారాణికి శనివారం ఫిర్యాదు చేశారు. మాచర్ల మండలం ఎయిర్పోర్ట్ సమీపంలో 2019-24 సంవత్సరాల మధ్యలో దొడ్డ చిన్న పెద్దిరాజు, మాధవరపు చంద్రశేఖర్ వందల ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని పట్టాలు పొందారని, ఈ భూ కుంభకోణంపై వాస్తవాలు వెలికి తీస్తున్నట్లు తెలిసిన కబ్జాదారులు మాచర్లలోని ఆర్టీసీ గ్యారేజ్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న తనను వెంబడించి రాడ్లతో దాడికి యత్నించారని చెప్పారు. చంద్రశేఖర్ ఫోన్లో తనను దుర్భాష లాడారని, చంపుతామంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
