ఎమ్మెల్యే కొండయ్యతో కౌన్సిలర్ల భేటీ : విజయవాడ ఇబ్రహీంపట్నంలో ప్రత్యేక సమావేశం

May 8,2025 00:54 ##Chirala #MLAKondaiah

ప్రజాశక్తి – చీరాల
శాసన సభ్యులు మద్దలూరు మాలకొండయ్యను విజయవాడ ఇబ్రహీం పట్టణంలోని ఆయన స్వగృహంలో మున్సిపల్ కౌన్సిలర్లు మర్యాద పూర్వకంగా బుధవారం కలిశారు. ఈనెల 14న మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం జరగనున్న నేపథ్యంలో టిడిపి కౌన్సిలర్లు ప్రత్యేకంగా భేటీ అవడం చీరాలలో చర్చనీయాంశమైంది. చైర్మపఖపై అవిశ్వాసం విషయంలో టిడిపి కార్యాలయంలో కౌన్సిలర్ల సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాసం పెట్టడం ఖాయమని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చైర్మన్ అభ్యర్థి ఎవరనే విషయంలో మొదటి నుండి తనతో ఉన్న కౌన్సిలర్లకే ప్రాధాన్యత ఉంటుందని, తన ఓటు, ఎంపీ ఓటు కూడా 22 మంది కౌన్సిలర్ల నిర్ణయంపైన ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ తరణంలో చైర్మన్ అభ్యర్థి విషయంపైనే నిర్ణయం తీసుకునేందుకు కౌన్సిలర్లు ఎమ్మెల్యేతో భేటీ అయ్యారని కొందరు, మర్యాద పూర్వకంగా కలిసి, ఆత్మీయ విందులో పాల్గొనేందుకు వెళ్లారని మరి కొందరు అంటున్నారు. అవిశ్వాసం తేదీ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి. ఏదేమైనా కౌన్సిలర్లు అందరూ ఎమ్మెల్యే కొండయ్య, నియోజకవర్గ అధికార ప్రతినిధి మహేంద్రనాద్‌తో భేటీ అవ్వటం చర్చనీయాంశంగా మారింది.

➡️