ఇంజనీరింగ్‌ కార్మికులకు బేసిక్‌ వేతనం రూ.21 వేలు, టెక్నికల్‌ వేతనం రూ.24,500 ఇవ్వాలి : ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌-సిఐటియు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరపాలక సంస్థల్లో మున్సిపాలిటీల్లో నగర పంచాయతీల్లో ప్రజానీకానికి త్రాగునీరు అందిస్తున్న పంపింగ్‌, సరఫరా, లీకులు, వాల్వాపరేటర్లు విభాగంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్‌ , విలీన ప్రాంత కార్మికులకు బేసిక్‌ వేతనం 21000, టెక్నికల్‌ వేతనం 24500 చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్‌ 30న కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాలో మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికులందరూ పాల్గని విజయవంతం చేయాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సిఐటియు అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ. జగన్మోహన్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఎల్బీజీ భవన్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10, 11 పి ఆర్‌ సి లో ఇంజనీరింగ్‌ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని, పారిశుధ్య కార్మికులతో సమానంగా బేసిక్‌ వేతనం 21000, టెక్నికల్‌ కార్మికులకు 24500/ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.2012 నాటి కనీస వేతనాలు నేటికీ అమలులో ఉన్నాయని, ప్రస్తుత ధరలకు అనుగుణంగా చట్ట సవరణ చేయాలన్నారు. విజయనగరం కార్పొరేషన్‌ పంప్‌ హౌస్‌ కార్మికులు థర్డ్‌ పార్టీ విధానంలో నలిగిపోతున్నారని, నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదని, అయినా అదే కాంట్రాక్టర్‌ కి మళ్ళీ టెండర్లు ఖరారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే టెండర్‌ ప్రకారం జీతాలు చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని , బకాయి జీతాలు చెల్లించాలని, కాంట్రాక్టర్‌ వచ్చినప్పటి నుంచి టెండర్‌ ప్రకారం చెల్లించాల్సిన బకాయిలను ఏరియాస్‌ రూపంలో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలపై సెప్టెంబర్‌ 30న కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పత్రిక విలేకరుల సమావేశంలో యూనియన్‌ నాయకులు రామానాయుడు, అరుణు, నారాయణరావు ,సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️