ప్రజాశక్తి-వన్టౌన్ (విజయవాడ) : విజయవాడ వన్ టౌన్ లోని మోటూరు హనుమంతరావు శ్రామిక భవనంలో స్ఫూర్తి, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా శిబిరాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన 50వ డివిజన్ కార్పొరేటర్ బోయి సత్యబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … చెస్ ఆడటం వల్ల మెదడు పదునెక్కుతుందని తెలిపారు. కావున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నెల రోజుల పాటు ఉచిత చెస్ శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన జ్యోతి కిరణ్ ను అభినందించారు. చెస్ శిక్షణ ఇచ్చేందుకు విచ్చేసిన ఇంటర్నేషనల్ ర్యాంక్డ్ ప్లేయర్ జ్యోతి కిరణ్ చెస్ ఆటలో ప్రాధమిక విషయాలను తెలియజేశారు. స్ఫూర్తి వేదిక బాధ్యులు సిహెచ్ సుబ్బారావు మాట్లాడుతూ… స్ఫూర్తి వేదికగా స్కూల్లో, నివాస ప్రాంతాల్లో నైతిక, మానవత్వ విలువలు పెంపొందించే ప్రోగ్రామ్స్ చేస్తున్నామని తెలిపారు. జన విజ్ఞాన వేదిక విజయవాడ కార్యదర్శి వెలగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వేసవి సెలవుల్లో జన విజ్ఞాన ఆధ్వర్యంలో గత 5ఏళ్ల నుండి సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్యాంపుల్లో డ్రాయింగ్, సైన్స్ ప్రయోగాలు, పేపర్ క్రాఫ్ట్స్, సరదా ఆటలు, పాటలు నేర్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెస్ శిక్షణా శిబిరం కన్వీనర్ రవి, ఇంఛార్జ్ ప్రశాంత్, దివ్యలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
