బిల్లులు అందక అగిన పనులు

May 10,2025 21:33

బిల్లుల కోసం గుత్తేదారులు ఎదురు చూపు
అర్ధాంతరంగా నిలిపివేసిన అభివృద్ధి పనులు

ప్రజాశక్తి – వీరఘట్టం  : టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గ్రామాల్లో వివిధ రకాలైన అభివద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. పనులు శరవేగంగా జరిగినప్పటికీ అధికారుల అలసత్వం వల్ల బిల్లుల చెల్లింపులు జరగకపోవడంతో పనులు ఫుల్‌… బిల్లులు నిల్‌ అన్న చందంగా తయారైంది. దీంతో గుత్తేదారులు ఎక్కడికక్కడే అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిపివేశారు. మండలంలోని విక్రంపురం జంక్షన్‌ నుండి కంబర వలస గ్రామం మీదుగా కంబర వరకు రూ.కోటీ పది లక్షలతో బిటి రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. వీరఘట్టం, వట్టిగెడ్డ వంతెన నుంచి కొట్టుగుమ్మడ మీదుగా గడగమ్మ వరకు కోటి రూపాయలు, చిదిమి జంక్షన్‌ సీఎస్పీ రహదారి నుంచి చిదిమి వరకు రూ.కోటీ 20 లక్షలు, పివిఆర్‌ పురం నుంచి తూడి వరకు రూ.రెండు కోట్లతో, ఆడారు బిటి రహదారి నుంచి డిపి వలస వరకు రూ.50 లక్షలు, బిటివాడ గ్రామ బిటి రహదారి నుండి చే బియ్యంవలస వరకు రూ.40లక్షలు, ఎం.రాజపురం గ్రామ జంక్షన్‌ సీఎస్పీ రహదారి నుంచి ఎం.రాజపురం మీదుగా కత్తులకవిటి వరకు రూ. రెండు కోట్లతో ఐటిడిఎ పర్యవేక్షణలో ఉపాధి హామీ చట్టం ద్వారా పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులు చేపట్టారు. ఈఏడాది మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి పనులు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు అధికారులు జారీ చేసినప్పటికీ గుత్తేదారులు లక్షలాది రూపాయలు అప్పు చేసి పనులు పూర్తి చేసినప్పటికీ బిల్లుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. అలాగే ఎం.రాజపురంలో రూ.50 లక్షలతో సిసి రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. కొట్టు గుమ్మడలో రూ.25.5లక్షలతోనూ, బూరుగలో రూ.20 లక్షలతో, కంబరలో రూ.25 లక్షలతో, గడగమ్మలో రూ.10లక్షలతో, బిటివాడలో రూ.11 లక్షలతో, బొడ్లపాడులో రూ.12లక్షలతో ఉపాధి హామీ చట్టం ద్వారా సీసీ రహదారులు, కాలువల నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ బిల్లులందక పోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గుత్తేదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయం ముంచికొస్తుందని రహదారుల నిర్మాణ పనులు వేగంగా చేయడంతో ప్రారంభించక ముందే కొన్ని బిటి రోడ్డు మరమ్మతులకు గురయ్యాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే నాణ్యతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నదని వీటిని చూస్తే అర్ధం చేసుకోవచ్చునని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.అర్ధాంతరంగా నిలిపివేసిన అభివృద్ధి పనులు మండలంలోని కడకల్లా, కంబర వలస, కె.ఇచ్చాపురం, బిటివాడ, అచెప్పువలస, వీరఘట్టం, ఎం.రాజపురం, చినగోరకాలనీ, జె.గోపాలపురం తదితర గ్రామాల పాఠశాలల వద్ద ఉపాధి హామీ చట్టం ద్వారా రూ.65లక్షలతో ప్రహరీ గోడలు నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. రూ.40 లక్షల వరకు పనులు పూర్తయినప్పటికీ పైసా బిల్లు కూడా చెల్లింపులు జరగలేదని అధికారులు చెబుతున్నారు. లక్షలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి వివిధ రకాలైన అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ బిల్లులు అందకపోవడంతో గుత్తేదారులు గగ్గోలు పెడుతున్నారు. నెలలు గడుస్తున్నా బిల్లులు చెల్లింపులు జరగకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని గుత్తేదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎంపిడిఒ బి.వెంకటరమణను ప్రజాశక్తి’ వివరణ కోరగా, మండలంలో రూ.9 కోట్లు పైచిలుక అభివృద్ధి పనులు జరిగాయని, ఒక్క దానికీ బిల్లు అవ్వలేదని అన్నారు.

➡️