- లేకుంటే 5న సిఎం కార్యాలయాన్ని ముట్టడిస్తాం : కృష్ణయ్య
ప్రజాశక్తి-పర్చూరు (బాపట్ల జిల్లా) : నల్లబర్లీ పొగాకుని తక్షణమే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య డిమాండ్ చేశారు. పర్చూరులోని అద్దంకి నాంచారమ్మ కల్యాణ మండపంలో, ఇంకొల్లులో గర్ల్స్ హైస్కూల్లో సోమవారం పొగాకు రైతులతో సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా వి కృష్ణయ్య మాట్లాడుతూ గిట్టుబాటు ధర లేక పొగాకు రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. నల్లబర్లీ పొగాకుని టుబాకో బోర్డు పరిధిలోకి తీసుకురావాలని కోరారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పొగాకుని కొనుగోలు చేయకపోతే మే 5న సిఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. విదేశాల్లో నల్లబర్లీ పొగాకుకి మంచి గిరాకీ ఉందన్నారు. ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల్లో అధిక ఆదాయాలు పొందుతున్న ఐటిసి, దక్కన్, జిపిఎ, రిలయన్స్, మహాలక్ష్మి, బొమ్మిడాల తదితర కంపెనీలు పొగాకుని కొనుగోలు చేసేలా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదస్సుల్లో నల్లమడ రైతుసంఘం అధ్యక్షులు డాక్టర్ కొల్లా రాజమోహన్, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు, ఉపాధ్యక్షులు వి హనుమారెడ్డి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, రైతుసంఘం జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు, జిల్లా ఉపాధ్యక్షులు కందిమళ్ల రామకోటేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, పర్చూరు ప్రాంతాల రైతులు తదితరులు పాల్గొన్నారు.