వారధి వేదనశిథిలావస్థకు చేరుకున్న వంతెనలు

May 8,2025 21:23

 పట్టించుకోని అధికారులు

కనిపించని ప్రమాద హెచ్చరిక బోర్డులు

భయాందోళనలో ప్రయాణికులు, వాహనదారులు

ప్రజాశక్తి – సంతకవిటి : సంతకవిటి మండలంలోని మల్లయ్యపేట, మంతిన, జావాం, వాసుదేపట్నం తదితర వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. 50 ఏళ్ల క్రితం ఈ వంతెనలు నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. అయితే కనీసం వంతెన వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డు కూడా కానరావడం లేదు. కళ్లెదుటే వంతెనలు ప్రమాదకరంగా కనిపిస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు హడావుడి చేసే అధికార యంత్రాంగం ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలలో భాగంగా వీటికి మరమ్మతులు చేపట్టకపోవడంపై పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పైన పటారం… లోన లొటారం మంతిన గ్రామం వద్ద వంతెనను 50 ఏళ్ల క్రితం నిర్మించారు.
ఈ వంతెన పైన పటారం….లోన లొటారం మాదిరి తయారైంది. ఈ వంతెన కింద భాగం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ వంతెనపై సంతకవిటి మండల కేంద్రానికి వెళ్తున్న మంతిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ వంతెన పిల్లర్లు బాగా పాడయ్యాయి. ఎప్పుడు కూలిపోతుందో తెలియని స్థితి. వంతెన వద్ద పంటపొలాలకు సాగునీరు అందించడానికి పూను వేసే చెక్క కట్టర్లు పూర్తిగా పాడైపోయాయి. కనీసం సంబంధిత అధికారులు పట్టించుకోకుండా గాలికి వదిలేశారు.

నేడో..రేపో అనేలా మల్లయ్యపేట వంతెన

మల్లయ్యపేట వద్ద ఉన్న వంతెన నిర్మించి సుమారు 50 ఏళ్లు పైబడటంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. కావలి, వాల్తేరు, బూరాడపేట, మంతిన, రామరాయపురం, చిత్తారిపురం, హోజరాం తదితర ప్రాంతాల ప్రజలు సంతకవిటి మండల కేంద్రానికి నిత్యం ఈ వంతెన మీదుగానే ప్రయాణిస్తూ ఉంటారు. ఈ వంతెన ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ వంతెనకు ఇరువైపులా రక్షణ గోడ లేకపోవడంతో వాహన దారులు, ప్రయాణికులు భయాందోళనకు గురై బిక్కుబిక్కుమంటూ వాహనాలు నడుపుతున్నారు. ఏమైనా వాహనాలు అదుపు తప్పితే సాగునీరు ప్రవహిస్తున్న గెడ్డలోని పడాల్సిందే. ఇంత ప్రమాదమని తెలిసినా కనీసం అధికారులు రక్షణగోడలు ఏర్పాటు చేయడం లేదని వాహనదారులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ వంతెనపై ఉన్న గుంతలను మట్టితో కప్పారు. వర్షాకాలంలో ఈ వంతెన బురదమయమై కనీసం వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

పెచ్చులూడుతూ..

వాసుదేవపట్నం వంతెన బయటకు కొత్తదిలా కనిపిస్తుంది. కానీ ఈ వంతెనకు 50 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ వంతెన శ్లాబ్‌ పెచ్చులూడిపోతున్నాయి. అయితే ఇరువైపులా రక్షణగోడ లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వాహనదారులు భయపడుతున్నారు. వాసుదేవపట్నం, పి.జె.పేట, ఎస్‌.రంగరాయపురం, హోజారం, మేడమర్తి, తమరాం ప్రజలు సంతకవిటి మండల కేంద్రానికి వెళ్లాలంటే ఈ వంతెన దాటాల్సిందే. ఈ వంతెన సమీపంలో కనీసం హెచరిక బోర్డులు కూడా కనిపించడం లేదు. రాత్రి వేళల్లో ప్రయాణికులు ఈ వంతెనపై రావాలంటే భయపడుతున్నారు.

నిత్యం రద్దీ అయినా..

మండలంలోని జావాం వంతెన నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటి వంతెన శిథిలావస్థకు చేరుకొంది. ఇరువైపులా రక్షణ గోడ లేదు. ఈ వంతెన దాటిన వెంటనే పగడాలమ్మ తల్లి దేవాలయం ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి యాత్రికులు నిత్యం వస్తుంటారు. వాహన రాకపోకలతో ఈ వంతెన నిత్యం రద్దీగా ఉంటుంది. ఇలాంటి వంతెనపై సంబంధిత అధికారులు దృష్టి సారించి, ఇరువైపులా రక్షణ గోడను నిర్మించాలని పలువురు కోరుతున్నారు.

➡️