పెద్దపులి దాడిలో గేదె మృతి

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: మండల పరిధిలోని గొట్టిపడియ గ్రామ శివార్లలోని మేళ్లచెరువు వద్ద మంగళవారం ఉదయం పెద్ద పులి దాడిలో గేదె మృతి చెందింది. అందిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన తంగిరాల వెంకటేశ్వర్‌రెడ్డికి చెందిన మూడు గేదెలు మేత కోసం గ్రామ సమీపంలోని పొలాలకు వెళ్లాయి. ఈ క్రమంలో అప్పటికే అటువైపు సంచరిస్తున్న పెద్దపులి ఒక్కసారిగా గేదెలపై దాడికి దిగింది. రెండు గేదెలు తప్పించుకొని వెళ్లిపోగా ఒక గేదెను వెంటాడి చంపింది. ఈ ఘటన గురించి గ్రామంలో తెలియడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అసలే తమ గ్రామం మారుమూల అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉందని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గొట్టిపడియ గ్రామస్తులు కాలం వెళ్లదీస్తున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పులి దాడి చేసినట్లు నిర్ధారించి పెద్దపులి పాదాల ముద్రలను సేకరించారు. మరొక ఘటన జరగకముందే అటవీశాఖ అధికారులు, పోలీసులు స్పందించి పెద్దపులిని పట్టుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. పెద్ద పులి దాడిలో మృతి చెందిన గేదె విలువ దాదాపు 80 వేల రూపాయలు ఉంటుందని దాని యజమాని వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

➡️