సమావేశంలో మాట్లాడుతున్న హరిబాబు
ప్రజాశక్తి-గుంటూరు : బర్లీ పొగాకును నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు కోరారు. మంగళవారం బ్రాడీపేటలోని సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. హరిబాబు మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 86వేల ఎకరాలు బర్లీ పొగాకును రైతులు అనేక వ్యయప్రయాసలకోర్చి సాగు చేశారన్నారు. గతంలో క్వింటాళ్ రూ.18 వేలకు కొనుగోలు చేయగా, ఈ ఏడాది కేవలం రూ.4 వేలు మాత్రమే ధర వస్తోందన్నారు. అప్పులు చేసి పంట పండించారని, రాష్ట్ర ప్రభుత్వం కలుగచేసుకొని, క్వింటాళ్ కనీసం రూ.15 వేలకు కొనుగోలు చేయాలని, దీనిపై వ్యవసాయ శాఖామంత్రి, కంపెనీలు వెంటనే స్పందించాలని కోరారు. ఈదురు గాలులకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ కార్మికులు, రైతులు, పేదలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను, గ్రామీణ హర్తాళ్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మిర్చి, వరి, కంది పెసర, అరటి, శనగ పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేయాలన్నారు. కౌలు రైతులకు, దేవాలయ భూములు సాగు చేసే రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు మంజూరు చేయాలని కోరారు. గుంటూరు ఛానల్ పనులు ప్రారంభించాలని, నల్లమడ ఆధునీకరణకు నిధులు కేటాయించాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో జిల్లా కమిటీ నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా బొట్ల రామకృష్ణ, నాగమల్లేశ్వరరావు ఎన్నికయ్యారు. జిల్లా నాయకులు ఎం.శివసాంబిరెడ్డి, పి.కృష్ణ, రామకృష్ణ, అమ్మిరెడ్డి పాల్గొన్నారు.
