ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లాలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. శనివారం ఉదయం తెలంగాణ నుంచి జిల్లాకు వచ్చిన ప్రయాణికులు గుంటూరుకు చేరుకుని గుంటూరు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గుంటూరు బస్టాండ్లో చాలినన్ని బస్సుల్లేక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఒకవైపు గుంటూరు నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు, మరొక వైపు ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే వారితో జిల్లాలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు శనివారం రద్దీగా కన్పించాయి. ఇదే సమయంలో ప్రజలకు ప్రయాణ కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రజల అవసరాల మేరకు బస్సులు, రైళ్లు అందుబాటులో ఉండటంలేదు. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్ సర్వీసులు ఎక్కువగా ఇతర ప్రాంతాలకు పంపడం వల్ల జిల్లాలోని ఆర్డీనరీ సర్వీసులను ప్రధాన మార్గాలకు మళ్లించాల్సి వచ్చింది. దీంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల సంఖ్య తగ్గింది. గుంటూరు నుంచి విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, నెల్లూరు తదితర ప్రాంతాలకు తరలి వెళ్లారు. కొంతమంది తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాలకు కూడా రిజర్వేషన్లు చేయించుకున్నారు. ఒకేసారి ఎక్కువమంది రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తుండటంతో రైళ్లు కూడా ఖాళీగా ఉండటం లేదు. రైళ్లలో జనరల్ బోగిలు తగ్గించడం, స్లీపర బోగీలు తగ్గించి ఏసీ బోగీలు పెరచడం వల్ల సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.విద్యాసంస్థలకు శుక్రవారం నుంచి నుంచి సెలవులు ఇచ్చినా తల్లిదండ్రులకు శనివారం నుంచి సెలవులు కావడంతో ఎక్కువ మంది శనివారం ఉదయం నుంచి ఇతర ప్రాంతాలకు బయలు దేరారు. రిజర్వేషన్లు లేని వారు టిక్కెట్లకోసం రైల్వేస్టేషన్లలో పడిగాపులు పడటం, క్యూలైన్లలో ఎక్కువ సేపు నిలబడటం కన్పించింది. కరెంటు రిజర్వేషన్లకూడా చాలామంది క్యూకట్టారు. తత్కాల్ టిక్కెట్ల కోసం కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వచ్చారు. రాష్ట్రంలోని అన్ని మార్గాల వైపు ఈనెల 18 వరకు రాను పోను బెర్తులన్నీ నిండిపోయాయి. ప్రధానంగా ఆయా పట్టణాల్లో సాప్టువేర్ రంగంలో స్థిరపడిన వారు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా రైళ్లలో రిజర్వేషన్లు దొరక్క బస్సులను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి కూడా జిల్లాకు వేలాది మంది తరలి వస్తున్నారు. దీంతో ఖాజా టోల్ గేటు వద్ద కూడా గత రెండు రోజులుగా వాహనాల రద్దీ పెరిగింది. సికింద్రాబాద్ నుంచి వస్తున్న అన్ని రైళ్లు రద్దీగానే గుంటూరుకు వచ్చాయి.శబరి,పల్నాడు, నారాయాణిద్రి, చెన్నై, విశాఖ తదితర ఎక్ప్రెస్లలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఇతర ఉద్యోగులు కుటుంబాలతో గుంటూరుకు చేరుకున్నారు. గుంటూరు నుంచి తిరుపతి వైపు, నంధ్యాల, అనంతపురం, బెంగుళూరు, చెన్నై మార్గాలకు వెళ్లే రైళ్లన్నీ రద్దీగా వెళ్లాయి. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా ఉమ్మడి జిల్లాకు చెందిన వారు సంక్రాంతికి సొంతూళ్లకు రావడం అనవాయితీగా వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబసభ్యులు తమ బంధువల రాకకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బంధువులతో పాటు పలు ప్రాంతాల్లో గ్రామస్తులతో, స్థానికులతో కలిసి సంబరాలు చేసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా గురటూరు, తాడికొండ, తెనాలి, వేమూరు, పొన్నూరు, మాచర్ల, నరసరావుపేట, చిలకలూరిపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి తదితర నియోజకవర్గాలకు చెందిన ఎన్ఆర్ఐలు, సాప్టువేర్ ఇంజినీర్లు ఎక్కువ మంది జిల్లాకు తరలివస్తున్నారు.