నిలిచిపోయిన రూ.21 కోట్ల సిఎఫ్‌ఎంఎస్‌ నిధులు

May 7,2025 20:58

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  నగర పాలక సంస్థలో కాంట్రాక్టర్లకు, అద్దె కార్ల వాహన దారులకు, కార్యాలయ నిర్వహణకు, విద్యుత్‌ బిల్లులు చెల్లింపునకు సిఎఫ్‌ఎంఎస్‌ ద్వారా రావాల్సిన రూ.21 కోట్లు నిధులు మార్చిల్లో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. సుమారుగా గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి కాంట్రాక్టర్లకు రావాల్సిన డబ్బులు రూ.14 కోట్లు, నగర పాలక సంస్థ కార్యాలయం లో అధికారులు తిరుగుతున్న 10 అద్దె కార్లకు నాలుగు నెలలు బిల్లులు, నగర పాలక సంస్థ కార్యాలయం కరెంట్‌ బిల్లు,నిర్వహణ ,వాటర్‌ సప్లై ఉద్యోగులు వేతనాలు,నిర్వహణ బిల్లులు మొత్తం కలిసి రూ.21 కోట్లు రావల్సి ఉంది. ఈ నిధులు సిఎఫ్‌ఎంఎస్‌లో ఫిబ్రవరి నాటికి నగర పాలక సంస్థ గణాంక విభాగం సిబ్బంది ఆన్‌లైన్‌లో అప్‌ లోడ్‌ చేశారు. మార్చి నెలాఖరు నాటికి అప్‌ లోడ్‌ చేసిన బిల్లులు మొత్తం రూ.21 కోట్లు వస్తాయని ఎదురుచూశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లులను రద్దు చేస్తూ చేదు కబురు పంపించింది దీంతో నవంబర్‌ నుంచి రావాల్సిన బిల్లులు సుమారుగా రూ.14 కోట్లు రాకపోవడంతో కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి, వడ్డీకి డబ్బులు తెచ్చి నగర పాలక సంస్థలో అభివృద్ధి పనులు చేస్తే సెప్టెంబర్‌లో బిల్లులు పెడితే ఇంత వరకు చెల్లించకపోతే ఎలా అని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9 నెలల పాటు బిల్లులు చెల్లించకపోవడం వలన కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులు చేసేందుకు వెనకంజ వేస్తున్నారు. మరో వైపు నగర పాలక సంస్థలో అధికార్లకు పది అద్దె కార్లు నడుస్తున్నాయి. అద్దె కార్లు వారికి డిసెంబర్‌ నుంచి బిల్లులు చెల్లించలేదు. సి ఎఫ్‌ఎంఎస్‌ ద్వారా పెట్టిన బిల్లులు ప్రభుత్వం రద్దు చేయడంతో అధికారులు స్పందించి ఇటీవల నగర పాలక సంస్థ ద్వారా కార్లు యజమానులకు నెల బిల్లులు చెల్లించారు. మరోవైపు సిఎఫ్‌ఎంఎస్‌ ద్వారా కార్యాలయ నిర్వహణకు, కరెంటు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇవి కూడా రద్దు చేయడంతో ఎప్పుడూ వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. అప్‌లోడ్‌ కు రాని ఆదేశాలు ప్రభుత్వం మార్చి నెలలో సిఎఫ్‌ఎంఎస్‌ ద్వారా రావాల్సిన నిధులు రద్దు చేసింది. కానీ ఎప్పటికైనా ఆ నిధులు విడుదల చేయాల్సిందే. అయితే మార్చి ముగిసి ఏప్రిల్‌, మే నెలల్లోకి వచ్చేసాం కానీ ఇంతవరకు బిల్లుల కోసం ఆన్‌ లైన్‌లో మళ్లీ అప్‌ లోడ్‌ చేసేందుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. మరల ఆన్‌ లైన్లో అప్‌ లోడ్‌ చేస్తే తప్ప ఆ నిధులు వచ్చే పరిస్తితి లేదు. ప్రభుత్వం ఎప్పుడూ ఆన్‌ లైన్లో అప్‌ లోడ్‌ చేయాలని అదేస్తుందో, ఎప్పుడు డబ్బులు వస్తాయోనని ఎదురు చూడటం తప్ప మరో మార్గం లేదు. దీంతో ప్రభుత్వ ఆదేశాలు కోసం నగరపాలక సిబ్బంది ఎదురు చూస్తున్నారు.

➡️