ప్రజాశక్తి – ఎఎన్యు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ, ప్రొఫెషనల్ కోర్సులకు నిర్వహించే పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు గురువారం తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఆర్ట్స్ కోర్సులు, సైన్స్, ఎంబీఏ, ఎంసిఏ, యంఇడి కోర్సులకు మూడవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహణ తేదీలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభమవ్వాల్సిన పరీక్షలు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి జరుగుతాయని వెల్లడించారు. ఈనెల 27వ తేదీ నుంచి జరగాల్సిన 1వ సెమిస్టర్ ఆర్ట్స్, సైన్స్, ఎంబీఏ, ఎంసిఏ, యంఇ డి పరీక్షలు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ పరీక్షలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతాయని తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ తేదీల్లో యూజీసీ నెట్ పరీక్ష ఉండటంతో వీసీ కె.గంగాధరరావు ఆదేశాల మేరకు మూడో సెమిస్టర్ పరీక్షల తేదీల్లో మార్పులు చేశామని, మూడో సెమిస్టర్ పరీక్షలు రాసే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ సమాచారాన్ని ఆయా కళాశాలలకు కూడా పంపుతున్నామని, యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచామని తెలిపారు.
