అసాంఘిక శక్తుల అణచివేతే లక్ష్యంగా తనిఖీలు

May 10,2025 20:59

ప్రజాశక్తి-విజయనగరంకోట :  దేశ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలోని ముఖ్య పట్టణాలైన విజయగరం, బొబ్బిలి, రాజాంలలో ఆకస్మికంగా ‘స్టేటిక్‌ స్ట్రేంజర్‌ చెకింగ్‌’ చేపట్టినట్లు ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని ముఖ్య పట్టణాలైన విజయనగరం వన్‌ టౌన్‌, టూ టౌన్‌, బొబ్బిలి, రాజాం ఆకస్మికంగా ‘స్టేటిక్‌ స్ట్రేంజర్‌ చెకింగ్స్‌’ చేపట్టారు. ఈ తనిఖీల్లో పోలీసు అధికారులు, సిబ్బంది ఒక ప్రాంతంలోకి ఆకస్మికంగా ప్రవేశించి, ఆయా ప్రదేశాల్లో గుమిగూడిన వ్యక్తుల లగేజ్‌లు, బ్యాగుల్లో మద్యం, గంజాయి, డ్రగ్స్‌, బాంబులు, ఇతర ప్రేలుడు వస్తువుల గురించి తనిఖీ చేసి, వారి వ్యక్తిగత గుర్తింపు కార్డులను పరిశీలించారు. కొన్ని తీవ్రవాద గ్రూపులకు చెందిన వ్యక్తులు దేశంలోకి ప్రవేసించి ప్రజలు ఎక్కువగా గుమిగూడి ఉండే ప్రాంతాలు, ప్రజాసముదాయాల్లో విధ్వంసాలు, విభిన్న మతాల మధ్య మత కల్లోలాలు సృష్టించే అవకాశం ఉన్నందున ఈ తనిఖీలు చేపట్టారు. విజయనగరం, బొబ్బిలి పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో పోలీసు అధికారులు, స్పెషల్‌ పార్టీ పోలీసులు, తనిఖీలు చేపట్టారు. విజయనగరం డిఎస్‌పి శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్‌పి జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డిఎస్‌పి ఎస్‌.రాఘవులు పర్యవేక్షించగా, సిఐలు ఎస్‌.శ్రీనివాస్‌, టి.శ్రీనివాస్‌, కె.సతీష్‌ కుమార్‌, హెచ్‌.ఉపేంద్రరావు, ఎస్‌ఐలు, పోలీసు, ఎస్‌టిఎఫ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️