పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉండాలిఏఈఆర్వో, నగర కమిషనర్ అరుణప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్ నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిర్దేశించిన అన్ని సౌకర్యాలు ఉండాలని ఏఈఆర్వో, కమిషనర్ డాక్టర్ జె.అరుణ సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలపై బుధవారం సాయంత్రం వీడియో సమావేశం ద్వారా వార్డు అమినిటీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ ర్యాంప్, విద్యుత్ సౌకర్యం, ఫర్నిచర్, మరుగుదొడ్లు, నీటి సరఫరా తప్పనిసరిగా ఉండాలన్నారు. సూపర్వైజర్ అధికారులు ప్రత్యక్ష పరిశీలన చేసి ఏఎఫ్ఎం సౌకర్యాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వేగంగా ఎంఎస్ఎంఈ సర్వే.. నగరపాలక సంస్థ పరిధిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) సర్వే వేగంగా పూర్తిచేయాలని కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులు, వార్డు కార్యదర్శులను ఆదేశించారు. ఎంఎస్ఎంఈ సర్వేపై వార్డు అమినిటీ, పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. వార్డు పరిధిలోని మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్తో పాటు వ్యాపార వాణిజ్య సంస్థలను సర్వే చేయాలన్నారు. వార్డు అమినిటీ, పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు సమన్వయంతో సర్వే వేగంగా పూర్తి చేయాలన్నారు. సర్వే వేగంగా జరిగేలా ఇంజనీరింగ్ అధికారులు, ప్రజారోగ్య విభాగం అధికారులు పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో ఎంఈ గోమతి, ఎంహెచ్వో డాక్టర్ లోకేష్, డీఈలు వెంకట ప్రసాద్, రమణ, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
