ఈనెల 20న జరుగు దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి : సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున

May 5,2025 15:44 #May 20, #may 20 strike, #strike

ప్రజాశక్తి – రాయదుర్గం : దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20 తేదీన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టనున్న ఒకరోజు సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున తెలిపారు. సోమవారం రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పోరాడు శిల్పలకు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మెను చేపడుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, ఆప్కాస్ ప్రవేట్ ఏజెన్సీలను అనుమతించవద్దని, మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, గత 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలకు సంబంధించిన జీవోలను జారీ చేయాలని, 12వ పిఆర్సి కమిటీని వెంటనే నియమించాలని తదితర డిమాండ్ల సాధన కోసం ఈ సమ్మెను చేపడుతున్నట్టు తెలిపారు. ఈ సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాయదుర్గం శాఖ ప్రధాన కార్యదర్శి రాము, కార్మికులు అశోక్, రాజు, ఆదిలక్ష్మి, వన్నూరమ్మ, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.

➡️