ప్రజాశక్తి – ఆరిలోవ : జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఈ నెల 30వ తేదీన చేపట్టే మహాధర్నాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కెఎస్వి.కుమార్ పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ కాంట్రాక్ట్ వర్కర్స్ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూపార్కులో 20 సంవత్సరాల పైబడి పనిచేస్తున్న కార్మికుల జీతాలు అతి తక్కువగా ఉన్నాయన్నారు. కనీస వేతనాలు, వారాంతపు, పండగ సెలవులు లేవన్నారు. జూలో ప్రమాదాలు జరిగితే పట్టించుకునే నాధుడే లేరన్నారు. నిత్యవసర ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, వైద్యం ఖర్చులు, రవాణా చార్జీలు విపరీతంగా పెరిగినా జీతాలు మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే ప్రభుత్వం కనీస వేతనంగా రూ.26 వేలు నిర్ణయించి అమలుచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వి. నరేంద్రకుమార్, జూ పార్క్ యూనియన్ నాయకులు నరేష్, రాజు, నర్సింగరావు, పైడిరాజు, దిలీప్, రామారావు తదితరులు పాల్గొన్నారు.
