విశాఖ : ” గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నా.. 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం లేదు ” అని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 1/70 చట్టాన్ని సవరించాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ … ఆదివాసీ అఖిలపక్ష ప్రజా సంఘాలు నేడు, రేపు రాష్ట్ర మన్యం బంద్కు పిలుపునిచ్చాయి. మంగళవారం తెల్లవారుజామునుండే మన్యమంతటా నిశ్శబ్దం అలుముకుంది. అన్ని దుకాణాలు, మ్యూజియంలు, వ్యాపారాలు, కార్యాలయాలు మూతపడ్డాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ క్రమంలో … ఎపి సిఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
” గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని మేము బలంగా నమ్ముతున్నాము. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మేము నిరంతరం పనిచేస్తున్నాం. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించాము. అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నాము. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెం.3 ని తేవడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి చేశాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వు రద్దు అయ్యింది. దాని పునరుద్ధరణకు మేము కృషి చేస్తాము. గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని… అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని గిరిజన సోదరులను కోరుతున్నా. సమాజంలో అట్టడుగున ఉన్న మీ అభివృద్ధికి సదా కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తున్నాము. ” అని పేర్కొన్నారు.
గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నా.. 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం లేదు : సీఎం చంద్రబాబు ట్వీట్
