ప్రజాశక్తి-గోకవరం (తూర్పు గోదావరి) : మండల కేంద్రమైన కోరుకొండ తహసిల్దార్ కార్యాలయాన్ని శనివారం కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, హజరు పట్టిక ప్రకారం హాజరైన సిబ్బంది వివరాలు డ్యూటీ లో డిప్యూటి తహసీల్దార్ ఏ రజనీను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో విధుల్లో ఉండాల్సిన సిబ్బంది ఎందుకు కార్యాలయంలో లేరని వివరాలు తెలుసుకుని, హజరు పట్టిక ను తన వెంట తీసుకుని వెళ్ళి, సంబంధిత సిబ్బంది కలెక్టరేట్ కు వొచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తహసిల్దార్ క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టడం కోసం పంపడం జరిగిందనీ, ఈ సమయంలో కార్యాలయ విధుల్లో ఉండాల్సిన సిబ్బంది బాధ్యత రాహిత్యంతో వ్యవహరించిన తీరు పై కలెక్టరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయ ఉద్యోగులు విధి నిర్వహణలో ఖచ్చితంగా సమయ పాలన పాటించడం, సిబ్బంది కదలికలను సంబంధిత రిజిస్టర్ లో నమోదుచేసి తదుపరి మాత్రమే ఆయా విధుల్లో హాజరు కావాలని తెలిపారు. విధి నిర్వహణలో నిలక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది నుంచి తగిన వివరణ తీసుకొని నివేదిక అందచేయాలని తహసిల్దార్ ని కలెక్టరు ఫోన్ ద్వారా ఆదేశించారు. ఎటువంటి అనుమతులు లేకుండా గైరాజరైన సిబ్బంది వివరాలను హజరు పట్టికలో కలెక్టర్ నమోదు చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓలు ఆర్ కఅష్ణ నాయక్, రాణి సుస్మిత, జిల్లా మైన్స్ ,జూవాలజి అధికారి డి. ఫణి భూషణ్ రెడ్డి, ఉన్నారు.
కోరుకొండ తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టరు పి.ప్రశాంతి
