ప్రజాశక్తి-సంతనూతలపాడు : యాభైఏళ్ల పాటు ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసిన కామ్రేడ్ నూకతోటి కోటయ్య నిబద్ధ కమ్యూనిస్టు అని, ఆయన జీవితం సార్ధకమైనదని పలువురు కొనియాడారు. మండలంలోని పేర్నమిట్ట శాంతి నగర్ కాలనీలో గురువారం సాయంత్రం నూకతోటి కోటయ్య 25వ వర్థంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలుత కామ్రేడ్ కోటయ్య స్తూపానికి పూలదండలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోటయ్య కోటమ్మ దంపతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని పలువురు గుర్తుచేసు కున్నారు. ఈ సందర్భంగా నటులు, దర్శకులు యల్ శంకర్, రంగస్థల కళాకారులు నూకతోటి జయబాబులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు సిటిజన్ ఫోరం ప్రతినిధి కొల్లా మధు, అడ్వకేట్ దాసరి కోటిలింగం, రాతికింద సుబ్బారావు, దాసరి చినబాబు, కేవీపీఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు అట్లూరి రాఘవులు, అడ్వకెట్ రామసుబ్బారావు, కుటుంబ సభ్యులు, సిపిఐ సానుభూతిపరులు పాల్గొన్నారు.
