- సదస్సులో కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు వేదిక పిలుపు
ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : లేబర్ కోడ్లు రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వరంగ సంస్థలు పరిరక్షణ కోసం, మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని డిమాండ్ చేస్తూ మే 20న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు వేదిక నాయకులు పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ.జగన్మోహన్ అధ్యక్షతన స్థానిక జెడ్పీ మినిస్ట్రియల్ భవనంలో జిల్లా సదస్సు శనివారం జరిగింది. సదస్సులో పాల్గొన్న కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు నేతలు మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం మీద బహుముఖ దాడి చేపట్టిందన్నారు. 95 శాతంగా ఉన్న కార్మికులకు తీవ్రమైన నష్టం చేకూర్చే విధంగా కార్మిక చట్టాలు,హక్కులపై దాడి చేస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు ప్రశ్నించే హక్కు లేకుండా , పని గంటలతో సంబంధం లేకుండా బానిసలుగా కార్మికులను చేసే పరిస్థితి నేడు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. అనేక పథకాల్లో ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వివిధ పథకాల్లో పని చేస్తున్న స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు లేవని, ఉద్యోగ భద్రత లేకుండా అభద్రతతో జీవిస్తున్నారన్నారని తెలిపారు. ప్రాణాలర్పించి 8 గంటలు పని దినం, సమ్మె హక్కు, కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కులు సాధించుకోవడం జరిగిందన్నారు. నేడు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్లకు అప్పగించే పాలన సాగుతుందన్నారు. 27 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చేసి కార్మికులను భానీసలుగా మార్చే ప్రక్రియ మోడీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులపై దాడి పెరిగిందన్నారు. అందులో భాగంగా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తే రైతులు ఏడాది పాటు 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయి తిప్పికొట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడాన్ని ప్రతిఘటించకోతే కార్మిక వర్గానికి మనుగడ ప్రమాదంలో పడుతతుందన్నారు. ఇటువంటి నేపధ్యంలో పోరాడి సాధించుకున్న చట్టాలను, హక్కులను, సమ్మె చేసే హక్కును, కనీస వేతనాలు సాధన కోసం, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసం మే 20 తేదీన జరుగుతున్న దేశ వ్యాప్త సమ్మెను జిల్లాలో అన్ని వర్గాలు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏం.వెంకటేశ్వరావు, ఏఐఎఫ్టియు రాష్ట్ర కార్యవర్గ సబ్యులు బెహరా శంకరరావు, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెఎవిఆర్కె.ఈశ్వరరావు, ఎపి మెడికల్ రిప్స్ యూనియన్ రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి యు.ఎస్రవికుమార్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బి.గీత, ఎఐఎఫ్టియు నాయకులు ఎం.అప్పలరాజు అన్ని కార్మిక, ప్రజా సంఘాలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు సదస్సు ఇటీవల ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు.