కార్మికసంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ల వేదిక పిలుపు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : లేబర్ కోడ్లు రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వరంగ సంస్థలు పరిరక్షణ కోసం, మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు , స్వతంత్ర ఫెడరేషన్ల వేదిక నాయకులు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక జెడ్పి మినిస్టీరియల్ భవనంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహన్ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో మోడీప్రభుత్వం కార్మికవర్గంపై బహుముఖ దాడి చేస్తోందన్నారు. 95 శాతంగా ఉన్న కార్మికులకు తీవ్రమైన నష్టం చేకూర్చే విధంగా కార్మిక చట్టాలు, హక్కులపై దాడి చేస్తోందన్నారు. కార్మికులకు ప్రశ్నించే హక్కు లేకుండా , పని గంటలతో సంబంధం లేకుండా బానిసలుగా కార్మికులను చేసే పరిస్తితి నేడు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. అనేక పథకాల్లో ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంటాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వివిధ పథకాల్లో పని చేస్తున్న స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు లేవని, ఉద్యోగ భద్రత లేకుండా అభద్రతతో జీవిస్తున్నారని తెలిపారు. ప్రాణాలు అర్పించి 8 గంటలు పని దినం, సమ్మె హక్కు,కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కులు సాధించు కున్నామని, కానీ నేడు మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్లకు అప్పగించే పాలన సాగుతుందన్నారు. 27 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా మార్చేసి కార్మికులను బానిసలుగా మార్చే ప్రక్రియ. మోడీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడాన్ని ప్రతిఘటించకోతే కార్మిక వర్గానికి మనుగడ ప్రమాదంలో పడుతతుం దన్నారు. ఇటువంటి నేపధ్యంలో పోరాడి సాధించుకున్న చట్టాలను, హక్కులను,సమ్మె చేసే హక్కును,కనీస వేతనాలు సాధన కోసం,ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునేందుకు ఈనెల 20న జరుగుతున్నసమ్మెను జిల్లాలో అన్ని వర్గాలు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ, ఐఎఫ్టియు రాష్ట్రఉపాధ్యక్షులు ఎం.వెంకటేశ్వరావు, ఎఐఎఫ్టియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బెహరా శంకరరావు, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెఎవిఆర్కె ఈశ్వరరావు, ఎపి మెడికల్ రిప్స్ యూనియన్ రాష్ట్ర సంయుక్త ప్రధానకార్యదర్శి యు.ఎస్రవికుమార్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బి.గీత, ఎఐఎఫ్టియు నాయకులు ఎం.అప్పల రాజు, కార్మిక, ప్రజాసంఘాలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకు ముందు ఇటీవల ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించింది.