ప్రజాశక్తి – కడప అర్బన్ వక్ఫ్ బిల్లు చట్టం కాకముందే కేంద్రం కార్పొరేట్లకు 99 ఏళ్లకు లీజు ప్రతిపాదనలు తయారు చేసిందని, అల్ప సంఖ్యాక వర్గాల రక్షణ, రాజ్యాంగ హక్కులు కాలరస్తున్నాయని వక్తలు పేర్కొన్నారు. సోమవారం ప్రెస్క్లబ్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ అధ్యక్షతన ‘వక్ఫ్ బోర్డు సవరణ చట్టం -రాజ్యాంగ బద్ధత సవాళ్లు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిసిసి అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి, ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ సుభాన్ మాట్లాడుతూ 2014 నుంచి కేంద్రంలో కొలువై ఉన్న బిజెపి ప్రభుత్వం, రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాల ముఖ్య మంత్రులు వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు చట్టం కాకముందే, ఇన్ని వేల ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని బెదిరింపులకు దిగారన్నారు. ధార్మిక బోర్డులలో పరమతస్తులను నియమించే నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమన్నారు. జస్టిస్ సచార్ కమిటీ ముస్లిం ధార్మిక సంస్థల ఆస్తుల రక్షణకు అనేక ప్రతిపాదనలు చేశారని ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. 1000 ఏళ్ల క్రితం దేశాన్ని పాలించిన నవాబులు దాతత్వం తో ఇచ్చిన ఆస్తుల దస్తావేజులు లేవని బై యూజర్ పేరిట ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటాను అనడం బిల్లు చట్టరూపం కాకముందే 52 కార్పొరేట్ బడా పెట్టుబడిదారులకు 99 సంవత్సరాలకు లీజులు ప్రధాన నగరాల్లోని విలువైన స్థలాలను, భవంతులను ఇవ్వటానికి ప్రతిపాదనలు ముందుగానే తయారు చేసుకోవడం అప్రజాస్వామిక చర్య అన్నారు. బాబ్రీ మసీదు మొదలుకుని చార్మినార్ వరకు దేశంలో మైనార్టీలపై హిందుత్వ ఫాసిస్టు భావాజాలంతో దాడులు జరుగుతున్నాయని, దేశంలోని మానవతావాదులు, లౌకికవాదులు, గణతంత్ర భావాలు కలిగిన వారు, ప్రజాస్వామ్యవాదులు, సామ్యవాదులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ముస్లిం యేతర సమాజాలు ముస్లింలకు అండగా, సంఘీభావంగా నిలబడాల్సిన అవసరం నేడు దేశంలో ఏర్పడిందన్నారు. గతంలో ధార్మిక సంస్థల్లో మహిళలు బోర్డు మెంబర్లుగా ఉండేవారని, బిజెపి మనువాద ప్రభుత్వం మహిళల ప్రాతినిధ్యాన్ని తిరస్కరిస్తూ చట్టాలు చేస్తోందని విమర్శించారు. ఇది భారత రాజ్యాంగం ఆర్టికల్ 14కు పూర్తిగా వ్యతిరేకమన్నారు. ప్రశ్నించే వారందరినీ అర్బన్ నక్సలైట్ల పేరుతో దేశద్రోహ కేసులు పెట్టి హింసిస్తున్నారని, చివరికి దేశ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని, సుప్రీం కోర్టు న్యాయమూర్తులను కూడా ఈ కోవలోకి చేరుస్తున్నారని ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో నియంతత్వం వస్తుందని ప్రజాస్వామ్యం కనుమరుగవుతుందని హెచ్చరించారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కన్వీనర్ డబ్ల్యూ రాము, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా అధ్యక్షులు ఓబయ్య, దళిత మిత్ర సంఘం నాయకులు రామాంజనేయులు ఆవాస్ జిల్లా అధ్యక్షులు పఠాన్ చాంద్ బాషా, బిఎస్పి జిల్లా అధ్యక్షులు పగిలి గుర్రప్ప, డాక్టర్ రామచంద్రారెడ్డి, న్యాయవాది రమేష్ బాబు, ముస్లిం జెఎసి జిల్లా కన్వీనర్ బాబు భారు, బిసి సంఘం రాష్ట్ర నాయకులు బి.సి. రమణ, మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధన సమితి నాయకులు బి.గురుమూర్తి, ఓ.సి.సంఘం వ్యవస్థాపకులు శ్రీనివాసుల రెడ్డి, ప్రజా సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ డాక్టర్.గోపాల్, హేతువాద సంఘం జిల్లా కార్యదర్శి సి.ఆర్.వి.ప్రసాద్, డాక్టర్ గౌస్ పీర్, లోక్ సత్తా నాయకులు కష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డాక్టర్ శ్రీనివాసులు, స్వతంత్ర పాస్టర్లు అసోసియేషన్ నాయకులు విజయభాస్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.ఎ. సత్తార్, హైకోర్టు న్యాయవాది అలీ ఖాన్, సిపిఎం నగర కార్యదర్శి ఏ.రామ్మోహన్, వి.అన్వేష్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, రాజకీయ పార్టీల, ప్రజాసంఘాల, మైనార్టీ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.
