ప్రజాశక్తి-కొండపి: కొండపి మండలంలోని నేతివారిపాలెంలో మహాత్మా గాంధీ విగ్రహం తొలగింపు వివాదానికి దారి తీసింది. గాంధీ విగ్రహం శిథిలమైపోతుందని, ఎండలో ఉందని గమనించిన ఒక వర్గం వారు వెంటనే నూతన విగ్రహాన్ని కొంత దూరంలో ఉన్న చెట్టుక్రింద రేకులు ఉన్న ప్రదేశంలో శనివారం ఏర్పాటు చేశారు. పాత విగ్రహం ఉన్న స్థానంలోని నూతన విగ్రహాన్ని స్థాపించాలని లేదా పాత విగ్రహానికి ఇటీవలనే మరమ్మత్తులు చేయించి రంగులు వేశామని దానినే కొనసాగించాలని మరో వర్గం వారు డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో జెసిబి సహాయంతో పాత విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మరొక వర్గం వారు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న కొండపి పోలీసులు ఎస్సై ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చారు. తొలగించిన పాత విగ్రహం స్థానంలో టిడిపికి చెందిన నాయకుల విగ్రహాలు పెడతారంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.
