క్యాంపుల్లో కార్పొరేటర్లు

Apr 27,2025 00:38

కోవెలమూడి రవీంద్రకు బీ ఫారం అందిస్తున్న తెనాలి శ్రావణ్‌కుమార్‌
ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి :
గుంటూరు నగర పాలక సంస్థ నూతన మేయర్‌ ఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీల కార్పొరేటర్ల క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి టిడిపి కూటమి కార్పొరేటర్లను చీరాలలోని అతిథి గృహాలకు తరలించగా వైసిపికి చెందిన వారికి కృష్ణా జిల్లా గన్నవరంలో ఏర్పాటు చేసిన క్యాంపులకు తరలించారు. గెలుపునకు తగినంత బలం లేకపోయినా వైసిపి బరిలో నిలిచింది. టిడిపి నుంచి 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ కోవెలమూడి రవీంద్ర మేయర్‌గా పోటీ చేస్తుండగా వైసిపి నుంచి అచ్చాల వెంకటరెడ్డి పోటీ చేస్తున్నారు. వైసిపి నుంచి టిడిపి కూటమిలోకి చేరిన 18 మంది కార్పొరేటర్ల మద్దతుతో పాటు ఎక్స్‌ అఫిషియో సభ్యుల ఓట్లతో కలిపి మొత్తం 33 మందితో మేయర్‌గా గెలుపొందేందుకు కోవెలమూడి రవీంద్ర వ్యూహరచన చేస్తున్నారు. అయితే చాలినంత బలం లేకున్నా కేవలం 27 కార్పొరేటర్లు, ఇద్దరు ఎమ్మెల్సీలతో కలిపి మేయర్‌ పదవికి పోటీ చేయాలని వైసిపి నిర్ణయం తీసుకుంది. అంతేగాక టిడిపి కూటమిలో అసంతృప్తి వాదులకు గాలం వేసేందుకు కూడా వైసిపి అంతర్గతంగా ప్రయత్నిస్తుండగా వైసిపి నుంచి మరికొంత మందిని చివరి నిమిషంలో తమ వైపునకు తిప్పుకునేందుకు కూటమి నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో తొలుత ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని భావించిన టిడిపికి వైసిపి తమ బలంతో గట్టి పోటీ ఇస్తోంది. దీంతో ఎవరి సభ్యులను వారు కాపాడుకునేందుకు క్యాంపులు ఏర్పాటు చేశారు. మరోవైపు టిడిపి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర పేరును ఖరారు చేస్తూ బి.ఫారంను జిల్లా పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్‌కుమార్‌ శనివారం విడుదల చేశారు. ఈ ఫారాన్ని ఆదివారం ఎన్నికల అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ భార్గవ తేజకు అందివ్వనున్నారు. ఆ పార్టీ తరుఫున విప్‌ కూడా జారీ చేయనున్నారు. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో వైసిపి నుంచి కార్పొరేటర్లుగా ఎన్నికయిన వారందరికి విప్‌ జారీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. వాస్తవంగా వైసిపి నుంచి 45 మంది ఎన్నికైన వారున్నారు. వీరిలో ప్రస్తుతం వైసిపికి 27 మంది ఉండగా 18 మంది టిడిపి, జనసేనలో చేరారు. దీంతో కూటమి బలం 29కి పెరిగింది. వీరితో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు, గుంటూరు ఎంపితో కలిపి 33 ఓట్లు టిడిపి కూటమి అభ్యర్థి కోవెలమూడికి దక్కే అవకాశం ఉంది. వైసిపికి ఉన్న 27 మందితోపాటు ఇద్దరు ఎమ్మెల్సీలు చంద్రగిరి ఏసురత్నం, లేళ్ల అప్పిరెడ్డితో కలిపి 29 మంది ఉన్నారు. మాజీ మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు ఎన్నికల్లో పాల్గొంటారా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది. ఆయన రాకుంటే వైసిపి బలం 28కి పడిపోతుంది. ఈ నేపథ్యంలో ఫిరాయించిన కార్పొరేటర్లపై వైసిపి జారీ చేసే విప్‌ ప్రభావం ఎంత వరకు ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.
ఇతరులు రాకుండా పటిష్ట ఏర్పాట్లు
కార్పొరేషన్‌ కౌన్సిల్‌ హాలులో సోమవారం జరిగే మేయర్‌ ఎన్నికకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులకు నోటీసులు జారీ చేశారు. సభ్యులు మినహా మిగతా ఎవ్వరూ సమావేశ మందిరంలోకి రాకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మీడియా గ్యాలరీలోకి కూడా ఇతరుల ప్రవేశాన్ని నిలుపుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు.

➡️