మాడుగుల (అనకాపల్లి) : అనకాపల్లి మాడుగుల నియోజకవర్గంలో గిరిజన ప్రాంతానికి ఆనుకొని ఉన్న రిజర్వాయర్ల పై అదాని కన్నుపడిందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న ఆరోపించారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దేవరాపల్లి మండలంలోని రైవాడ చీడికాడ మండలం కోణం ప్రాజెక్టులకు వచ్చే శారదా నది పైన చల్లగెడ్డ పైన కోణం ప్రాజెక్టుకు నీళ్లు వచ్చే బోడ్డెరు నదిపైన అదాని కన్ను పడిందన్నారు. ఈ రెండు అత్యంత కీలకమైనదన్నారు. పరీవాహక ప్రాంతాలుగా ఉండడంతోపాటు దట్టమైన అడవులు ఉండంతో ఈ ప్రాంతాన్ని అదాని హైడ్రోపవర్ ప్లాంట్లులకు ఎంచుకున్నారని తెలిపారు. దీనికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చకచకా అనుమతులు ఇచ్చేస్తున్నాయని తెలిపారు. దీంతో అదాని చేతుల్లోకి అడవులు వెళ్ళిపోతున్నాయని ఆందోన వ్యక్తం చేశారు. దీంతో గిరిజనులు బతుకులు పూర్తిగా బుగ్గిపాలై వన్య ప్రాణులకు తీవ్రమైన నష్టం కలగడంతోపాటు కోణం, రైవాడ ఆయకట్టు భూములు ఎడారిగా మారబోతున్నాయని ఆవేదన వ్వక్తం చేశారు. అదాని కంపెనీకి చెందిన ఏజెంట్లు ఈ ప్రాంతంలోని నివాసం ఉంటూ సోయిల్ టెస్టులు పనులు ప్రారంభించారని తెలిపారు. మరోవైపు ఫారెస్టు అధికారులు అదాని ఏజెంట్లు కలిసి సర్వేలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గిరిజనులు ఎక్కడికక్కడ అడ్డుకొని పంపించేస్తున్నారని తెలిపారు. కాని ప్రాజెక్టులు కిందున్న ఆయకట్టు రైతులకు చీమకుట్టీకుట్టనట్టు అయినా లేకపోవడం దుర్మార్గమన్నారు. గిరిజనులు పట్టు వదలకుండా. పోరాడుతున్నారని తెలిపారు. ఎలాగైనా హైడ్రోపవర్ ప్రాజెక్టులను కట్టాలని అనుమతి కోసం ఫారెస్టు ఉన్నతాధికారులు అనుమతులు కోసం అదాని కంపెనీ ఏజెంట్లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. దీన్ని గిరిజనులు ప్రతిఘటించక తప్పదన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో హైడ్రోపవర్ ప్లాంట్ నిర్మాణం జరిగితే దేవరాపల్లి మండలంలోని వాలాబు పంచాయతీలో సగం గ్రామాలకు చింతలపూడి పంచాయతీ లోని సగం గ్రామాలు అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలం లోని సరియా మాడ్రేబు మాకనాబిల్లి దాయిర్తి రేగులపాలెం తముటు కుడియా గ్రామాలుతో పాటు చీడికాడ మండలంలోని కోనాం, రైవాడ ప్రాజెక్టుకు గల ఆయకట్టు భూములు రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. గిరిజనులు జీవన పరిస్థితులు దెబ్బతినడంతోపాటు వన్య ప్రాణులకు, అటవీ ప్రాంతానికి నష్టం కలుగుతుందని తెలిపారు. ఇంతమందికి నష్టం జరుగుతుందని తెలిసి అధికార పార్టీ అదాని కంపెనీకి అడవులను తాకట్టు పెట్టి పబ్బం గడుపు కోవాలని చూస్తుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడుతామని విస్తృతంగా మొక్కలు నాటాలని ఈ బాధ్యతను పవన్ కల్యాణ్ కు అప్పగించాలని నిర్ణయించిన ప్రభుత్వం దట్టమైన అడవుల్లో ప్రమాదకరమైన హైడ్రో పవర్ ప్లాంట్లుకు ఏవిధంగా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. ఈ ప్రాంతం లోని గిరిజనులను మోసం చేసి వారికి డబ్బులు ఆశ చూపించి సర్వే పనులు చేయిస్తున్నారని తెలిపారు. అదాని హైడ్రోపవర్ ప్లాంట్ ప్రమాదం తీవ్రంగా ఉంటుందని, ప్రజలు గుర్తించాలని కోరారు. కొంతమంది స్వార్దపరుల మాటలు నమ్మి గిరిజనులు మోసపోవద్దని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫారెస్టు అధికారులు అనుమతులు ఇవ్వకూడదని కోరారు. ప్రభుత్వ అధికారులు ఆనుమతులు ఇవ్వడం వలన ఈ ప్రాంతం లోని గిరిజనులకు అదాని మనుషులకు ఘర్షణులు జరిగే ప్రమాదం ఉందన్నారు ఈ ప్రాంతంలోని హైడ్రోపవర్ ప్లాంట్ పనులు జరగాలంటే గిరిజనులు అనుమతి గ్రామ సభ పీసా చట్టం అటవి హక్కులు చట్టం 1/70 చట్టంలాంటి అనేక చట్టాలు ఉన్నాయని వీటిని ధిక్కరించి ప్రభుత్వం ఫారెస్టు అధికారులు ఏవిధంగా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు. గతంలో కూడా చింతలపూడి కూడియా రేగులపాలెం నగరం పాలెం ప్రాంతాలోని పవర్ ప్లాంట్లు కోసం పనులు ప్రారంభించగా గిరిజనులు ముక్త కంఠంతో వ్యతిరేకించడం జరిగిందన్నారు. ప్రాజెక్టు పనులు నిలుపుదల చేయకపోతే ప్రత్యక్ష ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. రిజర్వ్ ఫారెస్టులో అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గిరిజనులు చిన్నపాటి పోడు వ్వవసాయం చేస్తే కేసులు పెట్టే ప్రభుత్వం అడవులు నాశనం చేసే అదాని కంపెనీకి అడవులు తాకట్టు పెడాతారా ? అని ప్రశ్నించారు, ఈ ప్రారతంలోని హైడ్రోపవర్ ప్లాంట్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని కోరారు. అడవులను అదాని కంపెనీకి తాకట్టు పెట్టే ప్రతిపాదనలు మానుకోవాలని వెంకన్న డిమాండ్ చేశారు.
అదాని చేతుల్లోకి అడవులు : సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న
