టీటీడీ ఉద్యోగులకు హెల్మెట్ల పంపిణీ

ప్రజాశక్తి-తిరుమల : టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్‌ బీ.ఆర్‌.నాయుడు శనివారం ఉదయం తిరుమలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ తిరుమల నుండి తిరుపతికి వచ్చే టీటీడీ ఉద్యోగులకు ప్రయాణ సమయంలో భద్రత కల్పించడంలో భాగంగా హెల్మెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. ఉద్యోగులకు హెల్మెట్లు పంపిణీ చేసేందుకు గుంటూరుకు చెందిన జలాది రఘురామ్‌, ఢిల్లీకి చెందిన కేసీఎన్‌ హెల్మెట్ల తయారీ సంస్థ అధినేత నవీన్‌ ముందుకు వచ్చారని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతగా సుమారు రూ.5 లక్షలు విలువైన 555 హెల్మెట్లు విరాళంగా ఇచ్చారని చెప్పారు. 15 రోజుల్లో మరో 500 హెల్మెట్లు విరాళంగా ఇస్తారని చెప్పారు. వీటిని పరిశీలించి బాగున్నాయని తెలిపితే మరో ఐదు వేల హెల్మెట్లు అందిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్‌, వీజీవోలు రామ్‌ కుమార్‌, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️