రాయితీపై పశువుల దాణా పంపిణీ

ప్రజాశక్తి-సంతనూతలపాడు పశు పోషకులకు 50 శాతం రాయితీపై పశువుల దాణాను స్థానిక పశువుల ఆసుపత్రి వద్ద మంగళవారం జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్‌ కే బేబీరాణి పంపిణీ చేశారు. ఈ దాణాలో 25 శాతం మాంసకృత్తులు ఉంటాయని ఆమె పశు పోషకులకు వివరించారు. వేసవిలో వీటి ద్వారా పాల దిగుబడి, వెన్న శాతం తగ్గకుండా ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని ఆమె వెల్లడించారు. పశుపోషకులు 80 శాతం రాయితీతో పశువులకు ఆవులకు, ఇన్సూరెన్స్‌ చేయించుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వ రాయితీ పోను మూడు సంవత్సరాల కాలానికి కేవలం పశు పోషకులు 30 వేల రూపాయలు విలువచేసే పశువుకు 1920 రూపాయలు గాను సబ్సిడీ పోను 288 రూపాయలు మాత్రమే చెల్లించాలని వివరించారు. ఇన్సూరెన్స్‌ చేయించుకోవడం ద్వారా పశువులు, ఆవులకు, ఎంతో రక్షణ ఉంటుందని ఆమె అన్నారు. దాణాకు ముందుగా పశు పోషకులు తమ గేదెలు, ఆవులకు, 80 శాతం రాయితీతో ప్రభుత్వం కల్పిస్తున్న ఇన్సూరెన్స్‌ను చేయించుకోవాలని కోరారు. అదేవిధంగా గొర్రెలు, మేకలకు, మూడు సంవత్సరాల కాలపరిమితికి సంబంధించి ప్రభుత్వ రాయితీ పోను 56 రూపాయలు మాత్రమే చెల్లించి బీమాను చేయించాలని జేడీ విజ్ఞప్తి చేశారు. వేసవిలో పశువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పశు పోషకులకు వివరించారు. విపత్తుల వల్ల అకాల వర్షం పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా చెట్ల కింద వారి పశువులను, గొర్రెలు మేకలను నిలపరాదన్నారు. పశువులను మేపునకు తీసుకున్న తదుపరి లవణ మిశ్రమాలను అధికంగా పెట్టాలన్నారు. ప్రభుత్వం పశుపోషకుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తూ చేయూత నిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఇప్పటికే జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద రాయితీపై మినీ గోకులాలు కేటాయించినట్టు ఆమె తెలిపారు. రాయితీపై పశుగ్రాస విత్తనాలు, బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు ఆమె తెలిపారు. తెల్ల రేషన్‌కార్డు కలిగిన పశు పోషకులు 50 కిలోల దాణా 1110 రూపాయలు ఉండగా 50 శాతం రాయితీ పోను 555 రూపాయలు మాత్రమే పశుపోషకులు చెల్లించాలన్నారు. కిలో దాణా 11 రూపాయలకు ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. ఒక్కొక్క రైతుకు నెలకు 150 కిలోల వంతున మూడు నెలలకు 450 కిలోలు 50 శాతం రాయితీపై నాణ్యమైన సమీకృతమైన దాణాను ఇవ్వనున్నట్టు జిల్లా జెడి డాక్టర్‌ బేబీ రాణి వెల్లడించారు. జిల్లాకు మొదటి విడత కింద 250 మెట్రిక్‌ టన్నుల దాణాను ప్రభుత్వం కేటాయించినట్టు ఆమె తెలిపారు. జిల్లాలో ప్రతి మండలానికి 6.5 మెట్రిక్‌ టన్నుల దాణాను ప్రభుత్వం సరఫరా చేస్తున్నట్టు జిల్లా జేడీ డాక్టర్‌ బేబీ రాణి వెల్లడించారు. దాణా కావలసిన రైతులు రైతు భరోసా కేంద్రం, పశు వైద్య శాఖ కార్యాలయంలో నమోదు చేసుకొని వాటిని పొందాలన్నారు. 50 శాతం రాయితీపై ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన పశువుల దాణాను పశు పోషకులు సద్వినియోగపరుచుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ బేబీ రాణి కోరారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు పశువైద్యాధికారి డాక్టర్‌ బి ప్రతాప్‌రెడ్డి, పశు వైద్య సిబ్బంది, పశు పోషకులు పాల్గొన్నారు.

➡️