ప్రజాశక్తి – కడప : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సభ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) లో జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు .. క్షేత్ర స్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. క్రింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారినే వెళ్లాలని అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు. తొలుత జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పిజిఆర్ఎస్ దరకాస్తు లపై ఆయా జిల్లా అధికారులతో సమీక్షించారు. ఖాజీపేట నండిపాడుకు చెందిన లింగారెడ్డి రవనమ్మ ఎన్టీఆర్ వితంతు పెన్షన్ మంజూరు చేయాలని అభ్యర్తించారు. చింతకొమ్మదిన్నె మండలం అంగడి వీధికి చెందిన వి.ఆర్. శుభాషనమ్మ తన భర్త ఏపీఎస్ ఆర్టీసీ లో పని చేస్తూ 1999 సంవత్సరం మరణించారని, కారుణ్య నియామకం కింద పిల్లలకు ఉద్యోగం మంజూరు చేయాలని కోరారు. కాశీనాయన మండలం వారికుంట్ల గ్రామానికి చెందిన పి. నాగమ్మ సర్వే నెం. 140లో 0.40 సెంట్లు స్థలం కలదని, అందులో తన ఇంటి స్థలం కు సర్వే చేయించి హద్దులు చూపే వరకు పక్కవారు నిర్మాణం నిలుపుదల చేయించాలని అభ్యర్తించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, డీఆర్డీఏ, మెప్మా పిడిలు ఆనంద్ నాయక్, కిరణ్ కుమార్, ఎస్డీసి వెంకటపతి, శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి : జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్
