- మారిక గ్రామ సదస్సులో తీర్మానం
ప్రజాశక్తి – వేపాడ (విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లా వేపాడ మండల పరిధిలోని మారిక గ్రామ భూములను అదానీ కంపెనీకి అప్పగించొద్దని సిపిఎం సదస్సులో గిరిజనులు తీర్మానించారు. మారిక గ్రామంలో ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన సిపిఎం మండల నాయకులు చల్లా జగన్ మాట్లాడారు. మారిక రెవెన్యూలో 35 సర్వే నంబర్లు ఉంటే మొత్తం 32 సర్వే నంబర్లలో ఉన్న భూమలు, ఇళ్లు, బడి, గుడితోపాటు గ్రామం చుట్టూ ఉన్న అటవీ భూములు, కొండలు అదానీ గ్రూపునకు చెందిన హైడ్రో పవర్ ప్లాంట్కి అప్పగిస్తామని చెప్పడం అన్యాయమన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్యాలకు అదానిపై ఉన్న ప్రేమ గిరిజనులపై లేకపోవడం దారుణమన్నారు. మారిక గ్రామ భూముల్లో అదాని హైడ్రో పవర్ ప్లాంట్ ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే జిల్లాలోని మొత్తం గిరిజనులను ఐక్యం చేసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని, అదానీ కంపెనీని మారికలో అడుగు పెట్టకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించాలని సదస్సులో తీర్మానించారు. ప్రాణాలైనా ఇస్తాం కాని గ్రామాన్ని మాత్రం వదలబోమని గిరిజనులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పి పెంటమ్మ, జలారి వీరారాజు, పాలి సోమేశ్ కుమార్, గెమ్మెల బాబురావు, కిల్లో ఆనంద్, రామకృష్ణ, గెమ్మెల అప్పలనాయుడు, బొబ్బిలి గణేష్, వెంకటరావు, శ్రీను, ఆశుకృష్ణ, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.