సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్ : దేవాలయ భూములు అన్యాక్రాంతం కానివ్వొద్దని అధికారులను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో సత్తెనపల్లిలోని కాకతీయ కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి సమీక్షను బుధవారం నిర్వహించగా ఎమ్మెల్యేతోపాటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజరు గనోరె హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్లు, బ్రిడ్జిల సమస్యలపై అధికారులు దృష్టి సారించాలన్నారు. సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు రోడ్లోని శిథిలావస్థకు చేరిన బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం, సత్తెనపల్లి-అమరావతి మార్గంలో నందిగామ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టాలన్నారు. మంజూరైన గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలని, సాగు నీటి పారుదలకు చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని కోరారు. వేసవి నేపథ్యంలో నీటి ఇక్కట్లు రాకుండా కార్యాచరణను సిద్ధం చేసుకోవాలన్నారు. పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ చట్టం లక్ష్యాన్ని నెరవేర్చాలని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. ఎంపీ మాట్లాడుతూ పంచాయితీరాజ్ చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు. జెడ్పి అధికారులు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, కోర్టుకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించి త్వరగా కేటాయించాలని సూచించారు. విరిగిన, పాడైన విద్యుత్ స్తంభాలను, లో లెవెల్ విద్యుత్ కనెక్షన్లపై సత్వరం చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు సంబంధించిన విత్తనాలు, యాంత్రీకరణ పనిముట్లు, సబ్సిడీ మీద వచ్చే పరికరాలను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
రైతుల ధాన్యం నిల్వలను పరిశీలిస్తున్న అధికారులు
ధాన్యం కోనుగోలుకు తక్షణమే ఏర్పాట్లు
ప్రజాశక్తి-ముప్పాళ్ల : మండలంలోని ఇరుకుపాలెం గ్రామంలో రైతుల వద్ద ఉన్న ధాన్యం నిల్వలను జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి నారదముని బుధవారం పరిశీలించారు. సతైనపల్లిలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్షలో ధాన్యం కొనాలని రైతులు కోరిన నేపథ్యంలో ఎమ్మెల్యే, కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరుకుపాలెం గ్రామాన్ని నారదముని సందర్శించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొంటామని చెప్పారు. కార్యక్రమంలో తహశీల్దార్ భవానీశంకర్, ఏవో అరుణ పాల్గొన్నారు.
