రెవెన్యూ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వద్దు

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ప్రజాశక్తి పాడేరు: రెవెన్యూ కార్యక్రమాల అమలు, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్‌ ఎఎస్‌. దినేష్‌కుమార్‌ హెచ్చరించారు. మ్యుటేషన్‌ ప్రక్రియ జాప్యం చేస్తే ఉపేక్షించబోమని, భూముల రీసర్వే సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి 22 మండలాల రెవెన్యూ, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రీసర్వేలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలన్నారు. నీటి లభ్యతున్న వ్యవసాయ భూములకు నీటి పన్నులను వసూళ్లు చేయాలని ఆదేశించారు. 26 వేల మందికి పివిటిజిలకు ఆధార్‌కార్డులు జారీ చేయాల్సి ఉందని, ఆ ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. 35 వేల జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాల్సి ఉందన్నారు. అదే విధంగా చిరునామా, జనన ధ్రువీకరణ, గుర్తింపు కార్డుతో కూడిన నివాస ధ్రువీకరణలను గ్రామ సచివాలయం నుంచి జారీ చేయాలన్నారు.ప్రభుత్వ భూముల రక్షణ చర్యలుప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై హైకోర్టు సీరియస్‌గా ఉందని, దీనిపై సర్వే చేసి రిపోర్టు సమర్పించాలన్నారు. రెవెన్యూ అధికారులు, ఎంపిడిఒలు, పంచాయతీ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి దురాక్రమణ చేసిన భూములను గుర్తించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు.మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జలపాతాల వద్ద పర్యాటకులను అనుమతించవద్దని స్పష్టం చేసారు. గ్రామస్తులతో విఆర్‌ఒలు, మహిళా పోలీసులు చరించి పర్యాటక జలపాతాల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజె.అభిషేక్‌ గౌడ, పాడేరు సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ కనల చిరంజీవి నాగ వెంకట సాహిత్‌, డిఆర్‌ఒ కె. పద్మలత, ఎస్‌డిసి ఎంవిఎస్‌. లోకేశ్వరరావు, సర్వే సహాయ సంచాలకులు కె. దేవేంద్రుడు, వర్చువల్‌గా రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ కల్పశ్ర్రీ, 22 మండలాల తాహశీల్దారులు సర్వేయర్లు, విఆర్‌ఒలు పాల్గొన్నారు.

➡️