ప్రజాశక్తి – రాయచోటి టౌన్ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 5న తిరుపతి ఎస్పిడిసిఎల్ వద్ద నిర్వహించబోయే ఆందోళనను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.రామాంజులు, ఉపాధ్యక్షులు ఏ. వి. రమణ కోరారు. శుక్రవారం స్థానిక విద్యుత్తు సబ్ స్టేషన్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చలో తిరుపతి పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్బంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిస్కం అద్యక్షులు కె. సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు తరలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 23,500 మంది విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, 2022 పిఆర్సి ఏరియర్స్ ఇవ్వాలని, ఫీల్డ్ అసిస్టెంట్గా పని చేస్తున్న అన్ స్కిల్డ్ కార్మికులకు స్టిల్ చేసి స్కిల్డ్ వేతనం ఇవ్వాలని, కొత్త ఆపరేటర్లకు, పాత ఆపరేటర్లకు సమానంగా వేతనాలు ఇవ్వాలని, ప్రతి సబ్ స్టేషన్లో నైట్ వాచ్ మెన్ ను నియమించాలని చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్గా పని స్తున్న ఐటిఐ విద్యార్హత ఉన్న అన్ స్కిల్డ్ కార్మికులకు స్కిల్డ్ చేసి స్కిల్ వేతనం ఇవ్వాలని, కొత్త ఆపరేటర్లుగా ఉన్న వారందరికీ పాత ఆపరేటర్లతో సమానంగా జీతాలు ఇవ్వాలని కోరారు. మీటర్ బిల్ ఏజెన్సీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి ఎస్పిఎం కార్మికులకు కనీస వేతనం, ఇపిఎఫ్, ఇఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి సబ్ స్టేషన్లో నైట్ వాచ్మెన్ను నియమిం చాలన్నారు. పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు, కార్మికుడికి, కార్మిక కుటుంబాల్లో ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చిన ప్రమాదాలు సంభవించినప్పుడు పూర్తిగా ప్రభుత్వమే వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. చలో తిరుపతి కార్యక్రమానికి జిల్లాలోని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరూ పాల్గొని ధర్నా జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో యుఇఇయు ప్రధాన కార్యదర్శి ఎ.వి. రమణ యుఇసిడబ్ల్యూయు డివిజన్ అధ్యక్షులు నగేష్ గౌడ్, ఉపాధ్యక్షులు ఖాదర్ బాషా, నాయకులు రామాంజులు, శ్రీధర్, విశ్వనాథ, కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రైల్వేకోడూరు: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5న తిరుపతిలో సిఎండి ఆఫీస్ వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. విద్యుత్ ఎడి ఆఫీస్ వద్ద డిమాండ్స్తో కూడిన పోస్టర్స్ని ఆవిష్కరించారు. చలో తిరుపతి కార్యక్రమానికి జిల్లాలోని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరూ పాల్గొని ధర్నా జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో యుఇఇయు సబ్ డివిజన్ కార్యదర్శి, కుమార్ స్వామి, సహాయ కార్యదర్శి వేణు, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రాజు, అల్లా బకాష్, చంగల్ రాయుడు, గుప్త పార్వతి, ఎస్పిఎం హమాలీలు, పీస్ రేటు కార్మికులు పాల్గొన్నారు.
