చికెన్‌ ధరలు ఢమాల్‌

Oct 10,2024 22:07
చికెన్‌ ధరలు

కేజీ రూ.240 నుంచి రూ.180కి తగ్గిన రిటైల్‌ ధర
రూ.180 నుంచి రూ.140కి పడిపోయిన లైవ్‌ చికెన్‌ ధర
నష్టాల బాటలో పౌల్ట్రీ రైతులు
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి
చికెన్‌ ధరలు నేలను తాకాయి. రిటైల్‌ ధర రూ.180 కాగా లైవ్‌ చికెన్‌ రూ.140 మించడంలేదు. రైతు ధర రూ.108కి చేరింది కార్తీకమాసం రాక మునుపే ధరలు నేల చూపులు చూస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఓ వైపు పెరుగుతున్న మేత ధరలు, విద్యుత్‌ ఛార్జీలకు తోడుగా నిలకడ లేని ధరలు వంటి పరిణామాలు ఈ పరిశ్రమపై ఆధార పడిన వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏడాదిలో మూడు నెలలు పౌల్ట్రీ పరిశ్రమ ఆశాజనకంగా ఉంటుంది. మిగతా తొమ్మిది నెలల పాటు అటు ఇటుగా పరిస్థితి ఉంటుంది. కోళ్ల పెంపకానికి అయ్యే ఖర్చు, వచ్చే ఆదాయానికి సరిపోతుండటంతో శ్రమ వథా అవుతుందని పౌల్టీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వ్యవసాయం తరువాత పెద్ద పరిశ్రమగా పౌల్ట్రీ ఉంది. సుమారు 300 కోళ్ల ఫారాలు ఉన్నాయి. కిలో కోడి పెంపకానికి, మార్కెట్‌ చేరుకోవడానికి రవాణా ఖర్చు కలిసి రూ.120 కాగా రైతు ధర రూ.108 నుంచి రూ.130లకు మాత్రమే పరిమితమవుతోంది. కేజీ బాయిలర్‌ కోడి రైతు ధర రూ.108 కాగా రిటైల్‌ ధర రూ.140కి చేరింది. కేజీ చికెన్‌ ధర రూ.180 కాగా స్కిన్‌ లెస్‌ రిటైల్‌ మార్కెట్లోరూ.200 చొప్పన విక్రయాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఐదు కోట్ల కోళ్ల పెంపకం సరాసరిగా ఉత్పత్తి జరుగుతుందని అంచనా. దీనిలో 30శాతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఉత్పత్తి జరుగుతుంది. ప్రత్యక్షంగా 20 వేలమంది, పరోక్షంగా మరో 20 వేల మంది మొత్తం 40 వేల మందికి ఈ రంగంపై ఉపాధి పొందుతున్నారు. ఈ పరిశ్రమకు లారీ పరిశ్రమ అనుబంధంగా ఉపాధి లభిస్తుంది. రైతుల వద్ద కోళ్లను కొనుగోలు చేసి లారీ యాజమాన్యాలు ఒడిశా, బీహార్‌ బెంగాల్‌ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటాయి. అత్యధికంగా ఎగుమతి జరిగే బీహార్‌, బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలకు ప్రస్తుతం ఎగుమతులు పడిపోయాయి. అక్కడ ప్రభుత్వాలు పౌల్ట్రీ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడంతో కోళ్ల ఉత్పత్తి ఘననీయంగా పెరిగింది. ఈ ప్రభావం జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమపై గోరుచుట్టుపై రోకలి పోటులా మారింది. గత రెండేళ్లుగా కోళ్ల ఫారాలలో బ్యాచ్‌లు వేసేందుకు రైతులు వెనకడుగు వేస్తున్నారు. ఏటా పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవటం రాబడి క్రమ క్రమంగా తగ్గిపోవటమే కారణమని రైతులు చెబుతున్నారు.
కోడి పిల్ల ధర రూ.35 కాగా లేబర్‌ చార్జీ రూ.6,మెడిసిన్‌ ఖర్చు రూ.10, కరెంట్‌ బిల్లు రూ.1, వరిపొట్టుకు రూ.5,ఇతర ఖర్చులు రూ.3, ట్రేడర్‌ తరుగుదల కింద రూ.40, మొత్తంగా రెండు కిలోల కోడి పెంపకానికి రూ.240 ఖర్చు అవుతోంది.కిలో లైవ్‌ కోడి రూ.130 చొప్పున విక్రయిస్తే కొంత మేర ఆశాజనకంటా ఉన్నట్లేనని రైతులు చెబుతున్నారు. కోళ్లఫాంలో 10వేల కోళ్లను పెంచితే కోడికి(2కిలోలు) రూ.240 చొప్పున రెండు నెలలకు సుమారు రూ.24లక్షల ఖర్చుఅవుతోంది. కోళ్ల పెంపకానికి మొక్కజొన్న, సోయా దాణాను అధికంగా వాడుతుంటారు. మొక్కజొన్న దాణా టన్నుకు ఏడాదిలో రూ.18వేల నుంచి రూ.25వేలు, సోయా రూ.50వేల నుంచి రూ.80వేలకు పెరిగింది. దీంతో దాణా ఖర్చు రెట్టింపైంది. అదే స్థాయిలో కోడి ధర పెరగకపోవడంతో నష్టాలు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు.సాధారణంగా రెం డు కిలోల కోడిగా ఎదిగేందుకు రెండు నెలల సమయం పడుతుంది. ఈ కాలంలో కోడి మూడున్నర కిలోల దాణా తింటుంది. కిలో దాణాకు రూ.60 వ్యయం అనుకుంటే, మూడున్న ర కిలోలకు రూ.210 వరకు ఖర్చు వస్తుంది. దీంతో బ్యాచ్‌లు వేసేందుకు రైతులు వెనకడుగు వేస్తున్నారు.
చికెన్‌ ధరలు ఆశాజనకంగా లేవు
చికెన్‌ ధరలు గత కొంతకాలంగా ఆశాజనకంగా లేవు. ఏడాదిలో ఒకటి లేదా రెండు నెలలు మాత్రమే గిట్టుబాటు ధర వస్తుంది. మిగిలిన కాలమంతా నష్టాలు తప్పటంలేదు. దీంతో ఈ ఏడాది అత్యధిక మంది రైతులు కొత్త బ్యాచ్‌లు వేయలేదు. ఫలితంగానే ప్రస్తుతం లైవ్‌ కేజీ రూ.108 చొప్పున కొనుగోలు జరుగుతుంది. లేని పక్షంలో ధరలు ఇంకా నేలను తాకే అవకాశాలు లేకపోలేదు. ప్రభుత్వ ప్రోత్సాహం లేక తొలుత పౌల్ట్రీ రంగం నష్టపోవటంతో పాటు అనుబంధ వ్యాపారాలపైనా ప్రభావం చూపుతోంది. ఉపాధి దెబ్బతింటోంది.
– బి. కమలాకర్‌ , హోల్‌సేల్‌ వ్యాపారి

➡️