ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ, డిఆర్డిఎ, వైద్య ఆరోగ్య శాఖ తదితర సమన్వయ శాఖల అధికారులతో ‘చిన్నారి ఆరోగ్యం’ కార్యక్రమంపై కలెక్టర్ పి.ప్రశాంతి సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుత చిన్నారి ఆరోగ్యం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సామాజిక బాధ్యత కింద పోషకాహారం లోపం ఉన్న, దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న పిల్లల్ని గుర్తించి సాధారణ స్థితికి తీసుకుని రావడంలో భాగంగా ‘చిన్నారి ఆరోగ్యం కార్యక్రమానికి రూపకల్పన చేసినట్టు తెలిపారు. టిబితో బాధ పడుతున్న పిల్లలు, హెచ్ఐవి, తలసేమియా, సికిల్సెల్ తల సేమియా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి, వారి ఆరోగ్య స్థితిగతులను గుర్తించి, తగిన వైద్య సాయం అందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ప్రతి నెలా పిల్లలు ఆరోగ్యాన్ని పరీక్షించి మెడికల్ ఆఫీసర్ ద్వారా ఆరోగ్య పరీక్షలు చేసి, వారి ఆరోగ్యం మెరుగు పరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. గతంలో చేపట్టిన బంగారుకొండ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసే దిశలో చిన్నారి ఆరోగ్యం కార్యక్రమం రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ కె.విజయ కుమారి, అడిషనల్ డిఎం అండ్ హెచ్ఒ, డాక్టర్ ఎన్.వసుంధర, డిఆర్డిఎ పీడీ ఎన్వివిఎస్.మూర్తి, వైద్య అధికారి డాక్టర్ హరిచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
